16, జులై 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (196) : భండారు శ్రీనివాసరావు

 నిద్ర పట్టని రాత్రి

‘నా టార్గెటెడ్ రీడర్స్ ఆడవాళ్ళు కాదు, మగవాళ్లు, అదీ పెళ్ళయిన వాళ్ళు’ అని చాలా కాలం క్రితం ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను, నా భార్య విషయంలో నేను చేసిన తప్పులు, పొరబాట్లు వాళ్ళు చేయకుండా వుంటారు అనే ఉద్దేశ్యంతో. ఇలా పోస్టులు చదివి మనుషులు మారతారనే నమ్మకం నాకు లేదు. మారక పోయినా కొంత ఆలోచన మొదలవుతుంది అనే నమ్మకం మాత్రం వుంది.
‘డొమెస్టిక్ వయొలెన్స్ మాత్రమే హింస కాదు. ఉనికిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం అంతకంటే హింస’ అని సుజాత వేల్పూరి Sujatha Velpuri రాశారు ఒక పోస్టులో. ఇది చదివినప్పుడు నన్ను దృష్టిలో వుంచుకునే రాశారా ఏమిటి అనే సందేహం కలిగింది. ఎందుకంటే నా భుజాల మీద గుమ్మడికాయ గుర్తులు అలాగే వున్నాయి.
‘సమయానికి టిఫిను బట్టలు, భోజనం అమరుతుంటే నేను ఇంట్లో లేననే సంగతి కూడా గుర్తించడు మీ మామయ్య’ అదేమిటో చిత్రం, సుజాత అత్తయ్యగారు చెప్పిన ఈ మామయ్య పాత్రలో కూడా నాకు నేనే కనపడ్డాను.
‘అత్తయ్య అన్న ఆ మాటలో పెయిన్ తర్వాతెప్పుడో పెద్దయ్యాక కానీ, అర్ధం కాలేదని కూడా సుజాత రాసారు.
అచ్చు నాదీ ఇదే పరిస్థితి. మా ఆవిడ చనిపోయిన తర్వాత కానీ ఆమె అనుభవించిన బాధ నాకు అర్ధం కాలేదు. అర్ధం అయిన తర్వాత కొన్నాళ్ళపాటు ఆమె పడ్డ బాధలు గురించి తలచుకుంటూ అలా అలా రాస్తూ పోయాను. గతజల సేతు బంధనం వంటి నా పోస్టులు చదివి చాలామంది, ముఖ్యంగా మగవాళ్లు నా పట్ల సానుభూతి చూపుతూ ఓదార్పు మాటలు పలికారు. కొందరయితే, భార్యల పట్ల తమ వైఖరి మార్చుకుంటున్నామని కూడా రాసారు. అసలు ఆ ఆలోచన కలగడమే మారినంత ఫలం.
కరిగిన కాలాన్ని మళ్ళీ పట్టుకోలేము. మా ఆవిడ వున్నంతవరకు కాలం లేడిలా పరుగులు తీసింది. చుట్టూ వున్న ప్రపంచమే సర్వస్వం అయింది.
నేను రేపటి మనిషిని, నా ఆలోచనలు అభిప్రాయాలు వర్తమానం కంటే చాలా ముందుంటాయి’ అనేది నా గురించి నేను చాలా కాలంగా పెట్టుకున్న నమ్మకం.
అయితే వయసు దెబ్బయి తొమ్మిది దాటి, రేపోమాపో ఎనభయ్యవ పడిలో పడే సమయంలో కానీ, ఇందులోని డొల్లతనం నాకు తెలిసి రాలేదు.
నేను రేపటి మనిషిని కాకపోగా, ఎప్పటిదో పాతరాతి యుగం మనిషిని అనే వాస్తవం తెలిసి వచ్చింది. నిద్ర పట్టని రాత్రులు పెరిగాయి. కలత నిద్రల్లో పీడ కలలు పెరిగాయి. జ్ఞాపకాల ముసురుల్లో నిలువునా తడవడమే మిగిలింది.
గరుడ పురాణంలో పాపులకు వేసే శిక్షలు జ్ఞాపకం ఉన్నాయా!
అయితే ఒక ప్రేమ కధ చెబుతా వినండి. నాకు ఎలాగో నిద్రలేదు. మీరు మాత్రం ఎందుకు హాయిగా నిద్రపోవాలి?
అనగనగా ఓ అమ్మాయి. బుద్ధి తక్కువై ఓ అబ్బాయిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకుంది. దాంతో మొదలయ్యాయి ఆ అమ్మాయికి అంతులేని కష్టాలు.
అలాగని అతడు పెళ్ళాన్ని రాచిరంపాన పెట్టే బాపతు కాదు. ఆ అమ్మాయి అతడ్ని ప్రేమించినంత గాఢంగా, ఘాటుగా కాకపోయినా భార్యపై ఓ మోస్తరు ప్రేమకి తక్కువేమీలేదు.
మరిక కష్టాలు ఏమిటంటారా!
అతడికి దేవుడు అంటే నమ్మకమే. కానీ మూఢ భక్తి కాదు. గ్రహణాల పేరుతొ చూలింతలను చీకటి గదిలో పగలంతా పడుకోబెట్టడం వగయిరాలు నచ్చవు. భార్య తొలిచూలుతో వున్నప్పుడు సూర్య గ్రహణం వచ్చింది. చుట్టపక్కాల మాటల్ని, సలహాల్ని ఖాతరు చేయకుండా గర్భిణి అయిన భార్య చేత గోధుమ పిండి తడిపించాడు. ముద్దలు చేసి, చపాతీలు చేయించాడు. ఉల్లిపాయలు కోయించాడు. రోజువారీ పనులన్నీ పట్టుబట్టి అవసరం లేకపోయినా చేయించాడు. మూర్ఖంగా ఇవన్నీ చేయించాడే కానీ మనసు మూలల్లో ఏదో కలవరం. గ్రహణ కారణంగా పుట్టబోయే శిశువు అవకరంగా పుడితే... ఆ భయం అతడికి ఏ కొద్దోగొప్పో వుండివుండవచ్చేమో కానీ ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె ప్రేమలో ఏమాత్రం స్వార్ధం లేదు. అతడిపై పెంచుకున్న నమ్మకంలో అణుమాత్రం అపనమ్మకం లేదు. ఆమెది నిఖార్సయిన ప్రేమ. అందుకే అతడు చెప్పినవన్నీ నిశ్చింతగా చేసేసింది. తన భర్తపై ఆమెకు ఉన్న నమ్మకమే మూఢనమ్మకాలను జయించేలా చేసింది. మూఢాచారాలపై తన భర్త పెంచుకున్న అపనమ్మకాలకు ఒక విలువ దక్కేలా చూసింది. ఈ క్రమంలో అంత చిన్న వయస్సులోనే అంతులేని ధైర్య సాహసాలను ప్రదర్శించింది.
ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం నిజమే అయితే, భార్యను మానసికంగా ఇన్ని చిత్ర హింసలు పెట్టిన నాకు ఆ శిక్షలు పడాలంటారా లేదా!
అందుకే నా తోటి వారికి చెబుతున్నాను.
మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని అభిమానించేది...
మనం ఒకరిని ప్రేమించేది....
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికేనా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికేనా?
పొద్దస్తమానం ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకోవడానికేనా?
ఎక్కడైతే, హక్కుల ప్రస్తావన రాకుండా వుంటుందో
ఎక్కడైతే, చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా వుంటుందో
ఎక్కడైతే, అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా వుంటుందో
ఎక్కడైతే, బలహీనతలను చూసీ చూడకుండా వుండడానికి వీలుంటుందో
ఎక్కడైతే, పొరపాట్లను మన్నించే మనస్సు వుంటుందో
ఎక్కడైతే, తన మాటే నెగ్గాలనే పంతాలు, పట్టింపులు వుండవో
ఎక్కడైతే, అవసరానికి కాకుండా ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే, చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
పొరబాట్లే చేయని సీతలు, శ్రీరామచంద్రులే కావాలంటే అలాటివాళ్ళు, గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
తప్పులు చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు, సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి!
ప్రేమను పంచండి, ప్రేమను పొందండి.
సంసారం వన్ వే కాదు.
ఇది నా అనుభవంతో చెబుతున్న మాట.





(ఇంకావుంది)






(ఇంకా వుంది)

15, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో ( 195) : భండారు శ్రీనివాసరావు

భళిరా!
ఇది కదా గవర్నర్ ఎంపిక అంటే!
రాజభవనాల్లో పుట్టి పెరిగిన ఈ రాజు గారు గోవా రాజ్ భవన్ లో అడుగుపెట్టబోతున్నారు.
అశోక్ గజపతిరాజు రాజవంశం వాడయినా రాచరికపు లక్షణాలను వంటబట్టించుకోలేదు. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ రాజకీయ కాలుష్యానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన సచ్చీలత, నిరాడంబరత లోకవిదితం.
కొన్ని దశాబ్దాలుగా ఆయన తన పార్టీలో శిఖర సమానులు. అధికారాలు, హోదాలు ఆయనకు పుట్టుకతో అబ్బినవే కనుక వాటిని అడ్డం పెట్టుకుని విర్రవీగాల్సిన అవసరం లేని ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. అందుకే, ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంగా అందరూ పరిగణించే ఆర్ధిక శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు రెండూ నిర్వహించిన సమయంలో కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. హైదరాబాదులో వుంటే మాత్రం ఠంచనుగా సచివాలయానికి వచ్చి కూర్చునేవారు.
ఎప్పుడన్నా సెక్రెటేరియేట్ బీట్లో తిరుగుతూ అటు తొంగి చూస్తే ఆయన ఛాంబర్ ఖాళీగా కనిపించేది. చిన్న చిన్న శాఖలు చూసే మంత్రుల పేషీలు కూడా కూడా వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడుతుండేవి. రూలు ప్రకారం తప్ప పైరవీలు చెల్లవు అనే పేరు పడడం వల్లనేమో, రాజుగారి ఆఫీసులో జన సందోహం చాలా తక్కువ. ఆయన ప్రైవేట్ సెక్రెటరీ కమ్ ఓ.యస్.డీ., బీ ఎన్ కుమార్ గారు నన్ను చూడగానే, చిరునవ్వుతో, 'లోపలకు వెళ్ళండి పరవాలేదు' అనేవారు. తలుపులు తీసేవాళ్ళు, చీటీలు పట్టుకుని ఇచ్చేవాళ్ళు లేని వ్యవహారం కనుక, తలుపు తోసుకుని లోపలకు వెళ్ళేవాడిని. విశాలమైన మేజాబల్ల వెనుక కుర్చీలో కూర్చుని, సిగరెట్ తాగుతూ, ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఒకటి చదువుతూ, రాజుగారు దర్శనం ఇచ్చేవారు.
రేడియో విలేకరిని కాబట్టి, సంచలన వార్తల అవసరం ఏమాత్రం లేనివాడ్ని కాబట్టి ఆయన నన్ను చూడగానే, హాయిగా ఇంగ్లీష్ లో పలకరిస్తూ, కూర్చోబెట్టి రకరకాల విషయాలు చర్చించేవారు. రాజకీయాలను మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆయన పరిజ్ఞానం అమోఘం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేసేవాడిని. వార్త దొరకలేదన్న చింత లేని మనిషిని కదా!
నా జర్నలిష్టు మిత్రుడు ఎం.యస్. శంకర్ ఆ రోజుల్లో బీబీసీ తెలుగు వార్తలకు తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసాడు. అతడు రికార్డు చేసి బీబీసీకి పంపాల్సిన స్టూడియో రాజభవన్ రోడ్డులో వుండేది. రాజుగారి ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఔనడం, మేము ఆర్చుకుని తీర్చుకుని మినిస్టర్స్ కాలనీలోని (ఇప్పటి సీ ఎం క్యాంప్ కార్యాలయం వున్నచోటుకు కూతవేటు దూరంలో) వున్న ఆయన ఇంటికి శంకర్ స్కూటర్ పై వెళ్ళాము. ఆయన్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ, మంత్రిగారు సాయంత్రం ఇంటికి రాగానే డ్రైవర్ ని ఉంచుకోకుండా పంపించేస్తారు అన్న సంగతి మాకు తెలవదు. ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తుండగానే రాజుగారు బయటకు వచ్చి కారు తీసి మమ్మల్ని ఎక్కమని చెప్పి 'ఎక్కడకు వెళ్ళాలి' అని అడిగేసరికి మాకు మతిపోయినంత పనయింది. ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళడం, రికార్డింగు పని పూర్తిచేసుకోవడం అన్నీ సక్రమంగా జరిగిపోయాయి.
ఆ రోజుల్లో మా ముగ్గురినీ కలిపి వుంచిన బంధం ఒకటి వుంది. అందరం ఒకే బ్రాండ్ సిగరెట్ తాగేవాళ్ళం. తరువాత నేను మానేసాను. శంకర్ మానేసినట్టు చెబుతున్నాడు. రాజు గారిని కలవక దశాబ్దంన్నర దాటింది. ఆయన సంగతి తెలవదు. మానేస్తారన్న నమ్మకం నాకయితే లేదు. ఎన్టీ రామారావు గారంతటి వారు కూడా ఈ విషయంలో రాజుగారికి కొంత మినహాయింపు ఇచ్చారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు.
నరేంద్ర మోడీ మొదటి సారి ప్రధాన మంత్రి అయినప్పుడు దేశంలోని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఒక వెనుకబడిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే ఒక పధకం ప్రకటించారు. అప్పుడు ఒకే ఒక ఎంపీ ప్రధాని ప్రశంసకు నోచుకున్నారు. ఆయన ఎవ్వరో కాదు, ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. పార్లమెంటులోని మిగిలిన సభ్యులలో చాలామంది ఈ పధకాన్ని పట్టించుకున్న దాఖలా లేదు.
సాధారణంగా ఐ ఏ ఎస్ అధికారులు రాజకీయ నాయకుల వ్యవహార శైలి పట్ల సుముఖంగా వుండరు. మరీ ముఖ్యంగా రూలు బుక్కు పరకారం ముక్కుసూటిగా పోయే అధికారులు, అడ్డదిడ్డంగా పనులు చేయమని ఆదేశాలు ఇచ్చే మంత్రులు, ముఖ్యమంత్రుల విషయంలో వారికి సదభిప్రాయం వుండదు.
అయితే అశోక్ గజపతి రాజు గారు సుదీర్ఘ కాలం క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా ఆయన కింద పనిచేసిన ఏ ఒక్క అధికారీ రాజు గారి గురించి పల్లెత్తు మాట అనేవారు కాదు.
‘నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు అడిగితే ఎలా కాదంటాము, మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెడతాము చెప్పండి’ అంటారు రాజకీయులు. అదే నిజమనుకుంటే, రాజు గారు తమ యావత్తు క్రియాశీలక రాజకీయ జీవితంలో అన్ని పర్యాయాలు ఎన్నికల్లో ఎలా నెగ్గగలిగారు? పైగా ఆయన నిర్వహించిన శాఖలు ఆషామాషీవి కాదు. రెవెన్యూ, ఫైనాన్స్, ఎక్సైజ్ అన్నీ కీలక శాఖలే. అన్నీ బంగారు గుడ్లు పెట్టే బాతులే. అయినా, ఒక్క చిన్న మచ్చ పడకుండా రాజకీయం నడిపారు. మచ్చలేని మారాజు అశోక గజపతి రాజు.
కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అయిన శ్రీ పీవీ ఆర్కే ప్రసాద్ గారి అనుభవాలే ఇందుకు రుజువు. అదేమిటో చూద్దాం.
“సర్! ఈ సారా, లిక్కర్ అమ్మటం నా అలవాట్లకు విరుద్ధం. దయచేసి ఈ పోస్టులో మరెవరినైనా వేయండి” అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని వేడుకున్నారు ప్రసాద్ గారు.
“బ్రదర్, లిక్కర్ మా అలవాట్లకు కూడా భిన్నమే. కానీ రెవెన్యూ తెచ్చే వారుణి వాహిని పధకం పకడ్బందీగా అమలు జరగాలంటే మీ వంటి వాళ్ళు వుండాలి. ఇది ఉద్యోగ ధర్మం. ఆబ్కారీ వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి. లేకపోతే కిలో రెండు రూపాయల పధకానికి వందలాది కోట్లు ఎక్కడనుంచి తెస్తాం? ” అన్నారు ముఖ్యమంత్రి రామారావు గారు.
‘అసలేం జరిగిందంటే ..’ అనే పేరుతొ ప్రసాద్ గారు రాసిన పుస్తకంలో ఇలాంటి కొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.
“(ఈ కొత్త ఉద్యోగంలో) నాకు ఎదురైన మొదటి సవాల్ సారా పాటల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ఎలా అని.
“ప్యాకింగు లేని సారాని కల్తీ చేయకుండా నిరోధించడానికి నాటు సారాని కూడా బ్రాందీ, విస్కీల మాదిరిగా సీలు వేసిన సీసాల్లో సరఫరా చేస్తే... ఈ ఆలోచన అమలు చేయడానికి ప్రభుత్వమే ఒక సంస్థని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అనే సంస్ట కి నేను చైర్మన్ ని. సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన దువ్వూరి సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్. ఈ పోస్టులో వేయగానే నా దగ్గరకు వచ్చి తలపట్టుకుని కూర్చున్నాడు. ‘నాకు ఆ సారా వాసనే పడదు. నన్నీ పోస్టులో ఇరికించారేమిటి?” అన్నాడు.
“రైట్ కొస్చెన్ టు రాంగ్ పర్సన్ (Right question to wrong person) సుబ్బారావ్. ఏం చేద్దాం. తప్పో రైటో ముందుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు”
“అంతే! ఇద్దరం పనిలో దిగిపోయాం. ఊబిలో దిగిపోతున్నాం అనే సంగతి అప్పటికి తెలియదు.
“బాట్లింగ్ ప్లాంట్ల కోసం జిల్లాల్లో స్థలాలు సేకరించాం. బాట్లింగ్ యంత్రాలు కొన్నాం. సీసాలు కొన్నాం. వాటిని సరఫరా చేయడానికి క్రేట్లు కొన్నాం. చాలా బాగా చేశావయ్యా సుబ్బారావ్ అని అభినందించాను. సుబ్బారావు విచిత్రమైన నవ్వు నవ్వాడు. అతడి కవి హృదయం అర్ధం అయింది.
“కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.
“సరఫరా చేసిన సీసాలన్నీ బాట్లింగ్ ప్లాంట్లకు తిరిగి రావాలి. దుమ్ముకొట్టుకు పోయిన వాటిని శుభ్రం చేయాలి. ఏమాత్రం అశ్రద్ధ జరిగినా ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం. (ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని తాగేవారి క్షేమం గురించి ఆలోచించడం చిత్రంగా లేదూ)
“ఈ ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే పాలిథిన్ సంచుల్లో సారా సరఫరా. ఈ ఆలోచనని ముఖ్యమంత్రి ముందు వుంచాం. రామారావు గారికి బాగా నచ్చింది. ‘అద్భుతం. అలాగే చేయండి’ అన్నారు.
“ఈ పధకానికి ఓ మంచి పేరుకోసం ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. చివరికి మన పురాణాల్లో మద్యానికి అభిమాన దేవత, ఆదిశేషుని భార్య వారుణి పేరు బాగుందన్నారు. ఆ వారుణిని ఇప్పుడు ప్రజల్లోకి ఏరుల్లాగా ప్రవహింప చేయాలి కాబట్టి వారుణి వాహిని అని నామకరణం చేశారు.
“ఇలా రకరకాలుగా పన్నిన వ్యూహాలు ఫలించి వేలం పాటల్లో ఆబ్కారీ ఆదాయం ఒక్కసారిగా 180 కోట్ల రూపాయలకు అదనంగా పెరిగింది.
“రామారావు గారి ఆనందానికి అవధులు లేవు. మా అదృష్టం బాగుండి నిజాయితీపరుడు అయిన అశోక్ గజపతి రాజు గారు ఎక్సైజ్ మంత్రి కావడంతో ఆ ఏడాది అందరికీ కల్తీ సారా శక్తుల నుంచి రక్షణ కల్పించగలిగాము. మా ఎక్సైజ్ సిబ్బంది పీక్కు తినకుండా అడ్డుపడగలిగాం.”
అత్యంత సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన పీవీ ఆర్కే ప్రసాద్, తమ శాఖ మంత్రి గురించి అంత చక్కని కితాబు ఇచ్చారంటే అశోక్ గజపతి రాజు గారు ఎంతటి నిఖార్సయిన రాజకీయ నాయకుడన్నది అర్ధం చేసుకోవచ్చు.
విజయనగర సంస్థానానికి మహారాజు ఆయన, డబ్బులకు కక్కుర్తి పడే అవసరం ఏముంది అనవచ్చు. లంచాలు మేస్తున్నవారు, ప్రజాధనాన్ని దోచుకుంటున్న వాళ్ళు, పూట గడవకనే ఆ పనులు చేస్తున్నారా!
ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కదా అంటే ఏమనగలము?
కింది ఫోటో:
ఎక్కాల్సిన రైలు కొందరికి జీవిత కాలం లేటు కావచ్చు.
అర్హత వుండాలే కానీ ప్రత్యేక విమానాలు ఎగురుకుంటూ వస్తాయి.
దీనికి సాక్ష్యం ఇదిగో వీరే, రైల్వే స్టేషన్ ప్లాటుఫారంపై సాదా సీదా ప్రయాణీకుడి మాదిరిగా కూర్చున్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు!



(ఇంకావుంది)
15-07-2025

14, జులై 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (194 ) : భండారు శ్రీనివాసరావు

 

అమెరికాలో నారదుడు
వాషింగ్టన్ స్టేట్ లో సియాటిల్ కు దగ్గరలో వున్న మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్లాం. నగరంలో అనేక ప్రాంతాల నుంచి ఈ అగ్నిపర్వతం కనిపిస్తూనే వుంటుంది.
మధ్య దారిలో, కొండ సానువుల్లో ‘నారద జలపాతాన్ని’ మా కుమారుడు చూపించాడు. ‘నారద ఫాల్స్’ అని రాసి వున్న ఆ ప్రాంతంలో ఒక కొండపై నుంచి ఈ జలపాతం ధారలుగా దుముకుతోంది. 180 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ వున్నాయి. వెస్ట్రన్ వాహింగ్టన్ థియోసాఫికల్ సొసైటీ వారు ఈ జలపాతానికి హిందువుల దేవగురువైన నారదుడి పేరు పెట్టారని అంటారు. నారద మహర్షి త్రిలోక సంచారి. కాబట్టి అమెరికాలో కూడా అడుగుపెట్టాడేమో తెలియదు.
నారదుడు అంటే చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంగతి గుర్తుకువచ్చింది. హైదరాబాదులోని సమాచార భారతి సంస్థవారు ఒక ఏడాది నారద జయంతిని పత్రికాదినోత్సవంగా పాటించి కొందరు పాత్రికేయులను సత్కరించాలని సంకల్పించారు.
తగవులమారి అనే పేరు పడ్డప్పటికీ నిజానికి నారదుడు శాంతి కాముకుడు. ఆ మహర్షి ఎవరి నడుమ తంపులు పెట్టినా అది లోక కళ్యాణం కోసమే అని పురాణాలు చెబుతున్నాయి. నారడుడి మాదిరిగానే
విలేకరులు కూడా నిత్య సంచారులే. కాబట్టి జర్నలిష్టులను సన్మానించాలనే ఆలోచన ఆ సంస్థ వారు చేసి ఉండవచ్చు.
ఆనాటి పురస్కార గ్రహీతల్లో ఒకనాటి నా రేడియో సహోద్యోగి సుప్రశాంతి కూడా వుండడం వల్ల నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లాను. నాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు కూడా వచ్చారు. పూర్వాశ్రమంలో నా మిత్ర బృందంలోని విలేకరులు అనేకమంది అక్కడ కలిసారు. హాయిగా ఒక పూట గడిచిపోయింది.
పొతే, సుప్రశాంతి గురించి ఒక మాట.
సర్కారు ఉద్యోగం, అందులో సెంట్రల్ గవర్నమెంట్, అందులోను ఆలిండియా రేడియో రిపోర్టర్, వీటిని మించి సొంత ప్రాంతంలో పోస్టింగు, ఇన్ని కలిసివస్తే, నాలాగా కాలర్ తో పాటు తల కూడా ఎగరేస్తూ వుండాలి. అదేం చిత్రమో తలవంచుకుని పనిచేయడం తప్ప పాపం ఆ అమ్మాయికి వేరే పని తెలియదు.
బహుశా, వృత్తి పట్ల సుప్రశాంతికి వున్న ఈ అంకితభావమే ఆమెను ఉత్తమ జర్నలిష్టు అవార్డుకు ఎంపిక చేయడంలో దోహదపడి వుంటుంది. ప్రభుత్వం కూడా గుర్తించి ప్రమోషన్ తో మీద హైదరాబాదు దూరదర్సన్ కు బదిలీ చేసింది. అక్కడా సుప్రశాంతి పనితీరులో మార్పు లేదు. నేను పనిచేసే రోజుల్లో చుట్టూ హడావిడి. ఆమె పనిచేసే చోట ఆమె పేరుకు తగ్గట్టే ప్రశాంత వాతావరణం.
డిసెప్షన్ ఫాల్స్
సియాటిల్ కు తిరిగివస్తున్నప్పుడు త్రోవలో దట్టమయిన అడవుల నడుమ ‘డిసెప్షన్ ఫాల్స్’ అనే ఒక జలపాతం చూసాము. చూడడానికి చిన్నదే కానీ ఆ జలపాతం నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ఉరవడి మాత్రం చాలాఎక్కువ. బలిష్టమయిన ఏనుగులు కూడా ఆ వేగాన్ని తట్టుకుని నిలబడలేవని చెబుతారు. రోడ్డుపక్కన తాటిప్రమాణం చెట్ల నడుమ నుంచి కిందికి దిగి వెడితే ఇది కనిపిస్తుంది. అంతటి కారడవిలో కూడా టూరిస్టులకు అవసరమయ్యే సదుపాయాలూ కల్పించిన తీరు అమోఘం. ప్రసంశనీయం.
కింది ఫోటోలు :
అమెరికాలో నారద జలపాతం
నేను ఒకప్పుడు పనిచేసిన హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగం సహచర బృందం. ఈ గ్రూపులో కుడి నుండి మూడో ఆవిడే ఉత్తమ మహిళా జర్నలిష్టు సుప్రశాంతి. ప్రముఖ కధా రచయిత, న్యూస్ రీడర్, కీర్తిశేషులు డి.వెంకట్రామయ్య గారు కూడా నా పక్కన వున్నారు.
డిసెప్షన్ ఫాల్స్.

















(ఇంకా వుంది )

కోట జీవితానికి తెర పడింది - భండారు శ్రీనివాస రావు

 

మొన్న జులై పది ఆయన పుట్టినరోజు. మూడో రోజునే ఈ దుర్వార్త, కోట శ్రీనివాస రావు గారు ఇక లేరని.
“రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో నటిస్తూ నేర్చుకున్నాను”
తన డెబ్బయి నాలుగో పుట్టినరోజున ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి.
ఒకప్పుడు రేడియోలో పనిచేసిన మనిషిగా ఈ మాటలు విని నేనూ సంతోషపడ్డాను.
“బ్యాంకులో ఉద్యోగం. సాయంత్రాలు నాటకాలు రిహార్సల్స్. మధ్యమధ్య రేడియో నాటకాలు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేసిన అనుభవం. ఎవరో అన్నారు, సినిమాల్లో కూడా ప్రయత్నించరాదా అని. నాది నల్లటి ఛాయ. ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటారేమో అని బెరుకు”
అలాంటి మనిషి ఒకటీ అరా కాదు, లెక్కకు మించిన సినిమాల్లో వేశారు. అవీ చిన్నాచితకా వేషాలు కావు. నటనా వైదుష్యానికి గుర్తుగా ఎనిమిది నందులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఆకాశంలో ఓ వెలుగు వెలిగారు.
నేను రేడియోలో చేరిన కొత్తల్లో కోట శ్రీనివాసరావు గారు నారాయణ గూడా (దీపక్ మహల్ పక్కన) స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు తోటి నాటకాల నటులతో కలిసి రేడియో ఆవరణలో కనిపించేవారు.
ఒకరోజు అయన అన్నమాటలు నాకు బాగా జ్ఞాపకం.
“మా బ్యాంకు వాళ్లకు ఆటలు ఆడేవాళ్ళు తప్ప మా బోటి నటులు పనికిరారు. (ఆ రోజుల్లోనే క్రికెట్ క్రీడాకారుడిగా స్టేట్ బ్యాంకు ఉద్యోగి మహమ్మద్ అజహరుద్దీన్ నిలదొక్కుకుంటున్నారు. చిన్నతనంలో విఠల్ వాడీలో గల్లీ క్రికెట్ ఆడేవారని చెప్పుకునేవారు) వాళ్లకు అడగడమే ఆలస్యం సెలవు దొరుకుతుంది. నాకేమో రాకరాక ఓ సినిమా వేషం వచ్చింది. వారం రోజులు సెలవు కావాలంటే దొరకడం గగనం. సరే మేము సినిమాల్లో వేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మాత్రం క్రికెట్ ఊరికే ఆడుతున్నారా! ఎందుకీ వివక్ష?” అనేది ఆయన ఆవేదన.
సినిమాలు పెరిగాక ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు, అది వేరే విషయం.
స్టేట్ బ్యాంకులో మధుర బాబుగారని ఓ అధికారి వుండేవారు. (చనిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది) హైదరాబాదు మెయిన్ బ్రాంచికి మేనేజర్. సమర్ధుడైన ఆఫీసర్ అని పేరు. ఆ రోజుల్లో ఆయన హవా బాగా వుండేది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనిపించుకుంటున్న వారిలో అనేకమంది ఆయనకోసం ఆఫీసు బయట వెయిట్ చేస్తుంటే నేను ఆరోజుల్లో చూశాను. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారూ మధురబాబు గారు మంచి స్నేహితులు. మా అన్నయ్య విశాఖ గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా, మధురబాబుగారు నాగార్జున గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తదనంతర కాలంలో మా అన్నయ్య చెన్నై, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా, మధురబాబు గారు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రపంచ ప్రసిద్ధ కేన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయుడు మధురబాబు గారికి స్వయానా తమ్ముడు.
వేరే విషయం అంటూ వేరే వేరే విషయాల్లోకి పోతున్నానని అనుకుంటున్నారా. లేదు. కోట శ్రీనివాసరావు గారికీ బ్యాంకుకూ సంబంధం ఉన్నట్టే, ఒకప్పుడు ఏ బ్యాంకులో అయితే రెండు రోజులు సెలవు కోసం ఇబ్బందులు పడ్డారో అదే స్టేట్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఈ మధురబాబు గారికీ సంబంధం వుంది. అది కూడా అలాంటిలాంటి సంబంధం కాదు. తదనంతర కాలంలో ఈ ఇద్దరూ స్వయానా వియ్యంకులు అయ్యారు.



13, జులై 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (193) : భండారు శ్రీనివాసరావు

 

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ!

పుగెట్ సౌండ్. (Puget sound)

ఇది వంద మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి. జలసంధి కంటే పెద్దది. సముద్రం కంటే చిన్నది. పీటర్ పుగెట్ అనే వ్యక్తి పేరిట పుగెట్ అనే పేరు పెట్టారు. ఇక సౌండ్ అంటే మధ్యలో అనేక దీవులు, లంక భూములు, సముద్రంలో కలిసే నీటిపాయలు కలిగిన సముద్ర ముఖద్వారం లాంటిది. సముద్రంలోని ఉప్పు నీరు, నదులలోని తాగు నీరు కలిసివుండడం కారణంగా జల జీవ రాశులు, పక్షుల మనుగడకు తోడ్పడే వాతావరణ సమతుల్యానికి దోహదపడుతుంది. భారీ నౌకలు ప్రయాణించడానికి వీలైన లోతు, వెడల్పు కలిగిన ఈ జలాశయం ఒడ్డున వున్న నెలకొన్న అతి పెద్ద నగరం సియాటిల్.
పుగెట్ సౌండ్ తీరం పొడుగునా మైళ్ళ దూరం అతి చక్కటి కాలిబాటలు వేశారు. వాటికి, జలరాశికి నడుమ ఇనుప కంచె వుంది. ఆ ఇనుప తీగెల కంచెకు వందల సంఖ్యలో తాళాలు. కొంచెం వింతగా అనిపించే దృశ్యం. ఈ ఒక్క చోటనే కాదు యూరోపులో కూడా ఈ సాంప్రదాయం వుంది.
మన దేశంలో ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోషపడినట్టే, ఇక్కడ అమెరికాలో కూడా ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ సంతుష్టిపడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
తమ ప్రేమ బంధాన్ని తాళపు గుత్తులలో బంధించిన ఈ ప్రేమికుల్లో ఎందరి ప్రేమ ఫలించి పెళ్ళికి దారితీసిందో, ఎందరి ప్రేమ వికటించి దేవదాసులు అయ్యారో, ఎందరి ప్రేమ పెళ్ళిళ్ళు పుష్పించి పిల్లాపాపలతో కాపురాలు చేస్తున్నారో, తాళం చేసిన చేత్తోనే ప్రేమకు గుడ్ బై చెప్పి వేరే తాళాలు వేసిన వారెందరో ఆ లెక్కలు మనకు తెలవ్వు.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.
ఈ ప్రేమ తీరం వున్న అల్కి అవెన్యూ లోనే రెండు జంట గృహాలు వున్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటంటే వాటిని పూలతో అలంకరించడం. వీలుంటే పూలతో ఇంట్లో ఒక గదిని అలంకరించుకుంటాం, ఇంకా వీలుంటే ఇంటికి ముందూ వెనుకా పూల పొదలు పెంచుకుంటాం. అంతే కానీ మొత్తం ఇంటినే పూలతో నింపేయం!
కానీ ఈ రెండు ఇల్లు పూర్తిగా పూలగృహాలే! అడుగడుగు, అంగుళం అంగుళం అన్నీరంగురంగుల పూలే! ఎరుపు, తెలుపు, పచ్చ, ఊదా, గులాబీ ఇలా ఆ సృష్టికర్త ఎన్ని రంగులు ఇచ్చాడో అన్ని రంగాల పుష్పాలు అక్కడ చూడవచ్చు. కళ్ళారా చూస్తేనే కాని అభివర్ణించలేని గొప్ప దృశ్యం. వీటిని లో నిర్మించారు. తరువాత వెలిసిన అధునాతన గృహ సముదాయం నడుమ ఈ రెండు ఇళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటూ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అదేదో తెలుగు సినిమాలో ఒక పాత్ర చేత చెప్పించినట్టు ఈ అమెరికా వాళ్లకు అన్నీ విచిత్రాలే.

మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో...

సీనియర్ ఎన్టీఆర్ పాత పాతాళ భైరవి చిత్రంలో పింగళి నాగేంద్రరావు గారు రాసిన కలవరమాయే మదిలో అనే పాటలో ‘మోసులు వేసి’ అనే పాద ప్రయోగం చేశారు. ఈ మోసులు ఏమిటి అని అప్పుడు నా చిన్న బుర్రలో సందేహం. నెమ్మదిగా తెలిసింది ఏమిటి అంటే మోసులు అంటే మొలకలు అని.
సరే ఈ మొలకలు ప్రతి మనిషి జీవితంలో వుంటాయి. మోహం, మోజు, తమకం, ప్రేమ, కోరిక, ఇష్టం ఈ పదాలకు అర్ధాలు అన్నీ వయసును బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి.
చిన్నప్పుడు నాకు నూగాయ, నువ్వుపొడితో పెట్టిన ఆవకాయ కారం అంటే చచ్చేంత ఇష్టం. వేళ్ళ సందుల నుంచి కారిపోయేదాకా నెయ్యి వేసుకుని అన్నం తినడం మహా మోజు. పెనుగంచిప్రోలులో, నలుగురితో పాటు భోజనం చేస్తున్నప్పుడు, మా అన్నపూర్ణక్కయ్య ఎవరికీ కనపడకుండా కొంగు చాటున తెచ్చి నా కంచంలో మాత్రమే వేసే వెన్నపూస అంటే మహా ఇష్టం. వరంగల్ జిల్లా, మానుకోట దగ్గర ఈదులపూసపల్లిలో మా ప్రేమక్కయ్య ఉల్లిపాయ ముక్కలతో చేసే పచ్చి పులుసు, శ్రావణ మాసం రోజుల్లో అమ్మవారి మహా నైవేద్యం మీద పడకుండా, పిల్లలకోసం మా సరస్వతి అక్కయ్య చేసే చిరుతిండ్లు, ఎంత రుచిగా వుండేవంటే ఎవరికంటా కనబడకుండా దొంగతనంగా తినాలి అనిపించేంతగా గొప్పగా వుండేవి.
అంతేనా! మా పెద్దన్నయ్య గారింట్లో కొత్త సంవత్సరం అని ఓ కేలండర్ ఇచ్చారు. మూడు తెల్లటి పిల్లులు. అబ్బా వాటి అందం చూస్తుంటే కడుపు నిండిపోయేది. ఎవరో చుట్టం వచ్చి ఆ కేలండర్ కావాలంటే ఇచ్చేసారు. నాకు కడుపు రగిలిపోయింది. ఆ పిల్లుల కోసం ప్రాణం కొట్టుకుపోయింది. చంపడం అనే పదం తెలియని రోజులు. లేకపోతె అంతపనీ చేయాలన్నంత కోపం వచ్చింది అన్నమాట.
అలాగే కాలేజి అమ్మాయిలతో ప్రేమలు. వారిని మెప్పించడానికి కవితలు. రాసి పోస్టు చేయని ప్రేమ లేఖలు. ఈ టైపు ప్రేమలు, దోమలు ఆనాటి ఆడపిల్లలకు పట్టవని తెలిసేసరికి జుట్టు నెరిసింది.
పాతికేళ్ళ క్రితం మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు ప్రతిదీ వింతే! కనబడ్డవన్నీ కొనేసి ఇండియాలో కనబడ్డ వాళ్లకు పంచేయాలన్నంత ఆతృత. ఇప్పుడు ఉభయ పక్షాలకు ఈ గోల లేదు. అన్నీ అక్కడే దొరుకుతున్నాయి, ఇక్కడి నుంచి మోసుకుపోవడం దేనికనే తలంపు. ఆ కాలంలో ఊరికొకడు అమెరికాలో. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు.
జీవన గమనంలో ఒక చోట ఆగి సేద తీరుతుంటే ఇవన్నీ వ్యామోహాలా! మోజులా! తమకాలా! కోరికలా! ఇష్టాలా! అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇవన్నీ మనసు ఆడే ఆటలు అని అర్ధం కావడానికి ఇన్నేళ్ళు పట్టింది.
మనసు చాలా తెలివైనది. వయసుకు తగ్గట్టుగానే ఆడుతుంది.

కింది ఫోటోలు:

సియాటిల్ పుగెట్ సౌండ్ తీరంలో ఇనుప కంచెకు వేసిన ప్రేమ తాళాలు, ఫ్లవర్ హౌసేస్.

















(ఇంకావుంది)
13-07-2025

11, జులై 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (192) : భండారు శ్రీనివాసరావు

 మరణమా! జీవన్మరణమా!

నిన్న  వాల్ మార్ట్ కు వెళ్ళినప్పుడు ఒక వృద్ధ వనిత ట్రాలీ తోసుకుంటూ  బయటకు వస్తూ కనిపించింది. ముడుతలు పడ్డ శరీరం, నడుం వంగిపోయి వుంది. ఖచ్చితంగా ఆమె వయసు తొంభయ్ దాటి వుండాలి.

అయితే భిక్షువర్షీయసి గేయంలో శ్రీశ్రీ రాసినట్టు

‘ముగ్గుబుట్టవంటి తలా,

ముడుతలు తేరిన దేహం,

కాంతిలేని గాజుకళ్లు,

తన కన్నా శవం నయం’ అన్నంత దయనీయంగా లేదు. పైపెచ్చు  ఆమె కళ్ళల్లో కాంతి తగ్గలేదు. సామాన్లు వేసుకున్న ట్రాలీని  తోసే విషయంలో శరీర పాటవం సరిపోక అవస్థ పడుతున్నదే కానీ, ఎవరి సాయం అక్కరలేదనే ధీమా ఆమె కళ్ళల్లో స్ఫుటంగా కనబడుతోంది. నిర్గమన ద్వారానికి దగ్గరలో వృద్ధులకు రిజర్వ్ చేసిన చోట పార్క్ చేసి వుంచిన కారులో సామాను వేసుకుని చూస్తుండగానే, వాహనం నడుపుకుంటూ, ‘నా బతుకు నేను బతకగలను’ అన్నట్టు ధీమాగా  వెళ్ళిపోయింది. ఇంతటి ధీమంతం ఆ వృద్ధురాలికి ఎవరు ఇచ్చారు? ఏ వ్యవస్థ ఇచ్చింది?

ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు. ఒకరిపై ఆధారపడకుండా బతకగలమా! ఇది సాధ్యమా! కాళ్ళూ చేతులూ సరిగా వున్నప్పుడే, మంచాన పడకముందే, ‘ఇదిగో నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ అని చెప్పినంత సులభంగా, హుందాగా మరణించడం అయ్యేపనేనా!  

పైకి చెప్పుకున్నా చెప్పలేకపోయినా, ఒక వయసు వచ్చిన తర్వాత చాలామందికి మరణానికి సులువయిన మార్గం ఏమిటి అనే ఆలోచన తొలుస్తూనే వుంటుంది. దారుణ మరణాలను కళ్ళారా చూసినప్పుడు ఈ రకమైన వేదాంత తత్వం మరింత పెరుగుతూ వుంటుంది. మన దగ్గర  చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు ‘ఇలా కాళ్ళూ చేతులూ ఆడుతున్నప్పుడే దాటిపోతే బాగుంటుంద’ని. అలాగే మరణం తధ్యం అనుకున్న సందర్భాలలో కూడా, తమ మరణం హుందాగా ఉండాలనే ప్రతి మనిషి ఆలోచిస్తూ వుంటారనడానికి చరిత్రలో అనేక రుజువులు వున్నాయి. యావత్  ప్రపంచంలో తాను అందరికంటే అందగత్తెనని విర్రవీగిన క్లియోపాత్రా సంగతే చూడండి. అక్టేవియస్ సీజర్ తనని బందీగా పట్టుకుంటాడేమో అని భయపడిపోయిన క్లియోపాత్రా ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. చనిపోయిన తరువాత కూడా తన శరీరం రంగు మారి, అందం చెడకుండా వుండే  విషం కోసం అన్వేషించి,  ఒక రకం సర్పాన్ని అందుకోసం  ఎంపిక చేసుకుంటుంది.  చక్కగా అలంకరించుకుని, శయ్యాగతురాలై,  ఆ విషనాగుతో కాటు వేయించుకుని మహరాణిలా మరణిస్తుంది.

పురాణాల్లో మనకు తెలిసిన భీష్ముడి స్వచ్చంద మరణం కొద్ది తేడా వున్నా అలాంటిదే. కాకపొతే అర్జున గాండీవ విముక్త శస్త్రాలతో శరీరమంతా చిల్లులు పడి, అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఎదురు చూసి, తండ్రి ఇచ్చిన  స్వచ్చంద మరణ వరం కారణంగా ఇచ్చామరణం పొందిన గాధ  భీష్మాచార్యులది. ఆయన మాదిరిగా అలాటి వరభాగ్యం  అందరికీ దక్కదు.     

 

‘అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం...’ అన్నారు. హాయిగా చీకూ చింతా లేకుండా బతకడం, అనాయాసంగా చనిపోవడం ఈ రెండింటికీ మించి మనిషి బతుక్కు వేరే సార్ధకత వుండదు.

‘జాతస్య హిధ్రువో మృత్యు:’ అని గీతావాక్యం. పుట్టిన ప్రతి జీవీ గిట్టక మానదు, తప్పని దానికి విచారించడం దేనికన్నది కృష్ణుడి ప్రశ్న.

ప్రతి జీవితానికి ముగింపు మరణమే అని తెలిసి కూడా ప్రతి ఒక్కరూ మరణ భీతితోనే జీవిస్తుంటారు. ఇదొక వైచిత్రి.

జీవితం మనిషికి లభించిన అపూర్వ వరం. బలవన్మరణాలతో దీనికి చరమగీతం పాడరాదని పెద్దల వాక్కు. అయినా జీవించివున్నన్నాళ్ళు  మనిషిని  వెంటాడి వేధించే విషయం మరణ భయమే. ఆ భయంతోనే కాబోలు అనాయాసంగా మృత్యువు ఒడి చేరాలని అనుకుంటారు. కోరుకుంటారు.

‘దీర్ఘాయుత్వంచమే...’ అని చమకంలో చెప్పారు. అంటే  ఏమిటన్నమాట. అపమృత్యువు లేని దీర్ఘాయువు  కావాలి. శతమానం భవతి అంటూ  నిండు నూరేళ్ళు జీవించమని ఆశీర్వదించడం బట్టి చూస్తే పూర్ణాయుర్దాయం అంటే బాల్య, కౌమారాది నాలుగు దశలు దాటి సహజమైన ముగింపుకు చేరుకోవడం. ఏ ప్రమాదాలవల్లో అకాల మరణం రాకూడదని, ఆత్మహత్యల ద్వారా బలవన్మరణాలు తగవనీ  పూర్వీకులు చెబుతూ వచ్చారు. ఆత్మహత్య మహాపాపం అని నిర్ధారణ చేసి, దాన్ని నిషేధ కార్యాల జాబితాలో చేర్చేసారు కూడా.  

ఈ నేపధ్యంలోనే కారుణ్య మరణాల అంశం తెర మీదకు వచ్చింది.

ఆస్తులు, వారసులు, దాయాది తగాదాలు మిక్కుటంగా వున్న సమాజంలో కారుణ్య మరణాలకు చట్టబద్ధత కలిపిస్తే మరిన్ని చిక్కులు ఎదురుకాగలవని సందేహాత్మకుల డౌటేహం. ఆస్తులపై వ్యామోహంతో కన్నవారిని కూడా మట్టుబెట్టాలని చూసే వారి గురించిన కధలు, కధనాలు వింటున్నప్పుడు ‘కారుణ్య మరణాలకు’ అనుమతి ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువన్నది వారు వెలిబుచ్చే అనుమానం.

మంచాన పడి, అయిన వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకు బండి ఈడుస్తున్న అనేకమంది వృద్ధులకు, దీర్ఘ రోగ పీడితులకు  కారుణ్య మరణం అనేది ఉపశమనం కలిగించే విషయమే. అలాగే, వయోభారంతో  మంచానికి బందీగా మారి  కట్టకడపటి రోజుకోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కబెడుతున్న తమ కన్నవారిని సరిగా చూసుకోలేకా, చూడకుండా వుండలేకా అనునిత్యం మధన పడే వారి సంతానానికి సయితం ఈ  ఏర్పాటు ఒక విముక్తి మార్గంగా  కనిపించవచ్చు.

ప్రతి మనిషికి హుందాగా జీవించే హక్కు మాదిరిగా గౌరవంగా మరణించే హక్కు కూడా వుండాలని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. అంతా బాగున్నప్పుడు, జీవితంలో ఇక సాధించాల్సింది ఏమీ లేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కన్నుమూయడం ఎందరికి సాధ్యం.  ఇలాటి అవకాశం చట్టబద్ధంగా వుంటే జీవన్మరణాలు తగ్గిపోయి ప్రశాంత మరణాలు పెరుగుతాయని వారి అభిప్రాయం. సందేహం లేదు, ఇది   గొంతెమ్మ కోరికే.

ఇవన్నీ ఆలోచించడానికి ముందు, ముందు చెప్పిన ముసలావిడను గమనంలో వుంచుకోవడం మంచిది. బతుకు మీది తీపి చావకుండా ఎలా జీవనం సాగిస్తున్నదో తెలుసుకోవడం మంచిది. అలాంటి ధీమాను ఎలాంటి వ్యవస్థ హామీ ఇస్తున్నదో దాన్ని కోరుకోవడం మరీ మంచిది.

ఉపశృతి: మా దూరపు చుట్టం ఒకరు జీవితంలో అన్ని బాధ్యతలు నెరవేర్చుకున్నారు. పిల్లల చదువులు, పెండ్లి పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ ఒక పద్దతిగా పూర్తి చేసుకున్నారు. పిల్లలు, మనుమళ్ళు కళకళలాడుతూ  నట్టింట తిరుగుతూ వున్నవేళ, ఒక రోజు భార్యాబిడ్డలతో  తీరి కూర్చుని కబుర్లు చెబుతూ, చెబుతూ  హఠాత్తుగా ఒక పక్కకి ఒరిగిపోయారు. అంతే. ఒక క్షణం ముందు వరకు ఆయన ప్రాణం వున్న మనిషి, మరుక్షణం విగత జీవి. అంతవరకూ నవ్వుతూ కబుర్లు చెప్పారు. పిల్లలు చెప్పినవి నవ్వుతూ విన్నారు. అలా ఆయన జీవనయానం   హాయిగా, ప్రశాంతంగా  ముగిసింది. కోటికొక్కరికి కూడా లభించని  అరుదయిన అవకాశం.

చావు ఒక ముగింపు కావచ్చు, పరిష్కారం మాత్రం కాదు.

కింది ఫోటో: Courtesy Google



(ఇంకావుంది)

11-07-2025

10, జులై 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో ( 191 ) : భండారు శ్రీనివాసరావు

 

భార్యావియోగం
‘ఎప్పుడూ ఈయనకు ఈ భార్య నామస్మరణ ఏమిటి? ఎవరికి లేరు భార్యలు?’ అనే మాటలు నా చెవినపడక పోలేదు. అది నిజమే కదా! సమర్థించుకోవాల్సిన అవసరమేముంది?
మా ఆవిడకి ప్రియనేస్తం వనం గీత ఈ వాక్బాణాన్నే మరోరకంగా మా ఆవిడ మీద ప్రయోగిస్తూ వుండేవారు.
‘వస్తానండీ! మా ఆయన వచ్చే వేళ అయింది’ అనగానే, ‘ఏమిటి దుర్గా! (మా ఆవిడకి మరోపేరు) మాకు లేరా మొగుళ్లు? మీరు పోయి కాఫీ కలిపి ఇవ్వాలా! ఆ మాత్రం ఆయన చేసుకోలేరా! మరీ గారాబం చేస్తున్నారు’ అనేది నవ్వుతూ.
నిజానికి భార్య నామస్మరణ వేరు, భార్యావియోగం కారణంగా ఆమెను పదేపదే తలచుకోవడం వేరు. ఈ వియోగబాధ శ్రీరామచంద్రులవంటి వారికే తప్పలేదు. రావణ వధ అనంతరం సీతాదేవిని మళ్ళీ కనులారా చూసేవరకు సీతా సీతా అంటూ ఎన్ని సార్లు తలచుకున్నది రామాయణం గురించి తెలిసినవారందరికీ తెలుసు.
భార్యా వియోగం గురించి విశ్వనాధ వారి అనుభవం ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు రాసిన విషయాలు చదివిన తర్వాత అంతటి కవి సామ్రాట్ కే ఈ వేదన తప్పలేదని అర్ధం అయింది. విశ్వనాధ ప్రియ శిష్యులు పేరాల భరత శర్మ గారి ద్వారా ఈ సంగతులు సోమయాజులు గారికి తెలిశాయి. వారు పేర్కొన్న విషయాలు సంగ్రహంగా .
విశ్వనాధ వారు రాసిన రామాయణ కల్పవృక్షం గ్రంధానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. బెజవాడ రేడియో స్టేషన్ వారి ఆహ్వానంపై విశ్వనాధ సత్యనారాయణ గారు, తన శిష్యులు అయిన పేరాల భరత శర్మ గారిని వెంటబెట్టుకుని కారులో వెడుతున్నారు. అప్పుడు ముచ్చట్ల నడుమ విశ్వనాధ గారు ఇలా చెప్పుకొచ్చారట.
‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా, చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే, వానికి ఏమి మర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమృతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహా యిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956 లో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వాన కురిస్తే ఇంట్లో మోకాటి లోతు నీళ్ళు. ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలా వుంటుంది? బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్య లేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు.
శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగ మహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన’ అని ముగించారు భరత శర్మగారు.
ఇంత అద్భుతమైన వృత్తాంతాన్ని అందచేసిన సోమయాజులు గారికి ధన్యవాదాలు.
అంత పెద్దవారితో పోల్చుకుని నా భార్యా వియోగానికి ఉన్నతిని కల్పించడం కోసం కాదు ఇది మొదలు పెట్టింది.
అమెరికా వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం నెట్ సంచారం చేస్తుంటే, కొన్ని పాత వీడియోలు కంటపడ్డాయి. వాటిల్లో ఒకటి మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్రికేయ రంగంలో జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించి నాకు అందచేసింది. ముఖ్యమంత్రి నుంచి అది స్వీకరిస్తున్నప్పుడు దాన్ని పైలోకాల్లో వున్న మా ఆవిడకి చూపించడానికి పైకి ఎత్తాను. నా ఈ చర్యను ఎవరు గమనించారో లేదో నాకు తెలియదు. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆమెకు మనసులో కొంచెం కినుకగా వుండేది. అది వచ్చిన రోజున ఆమె లేదు.
తోకటపా!
ఈ అవార్డు వచ్చిన ముహూర్త బలం ఏమిటో కానీ అప్పటి నుంచి నా రాజకీయ రచనా వ్యాసంగానికి స్వస్తి చెప్పాల్సిన దుర్గతి దాపురించింది.
అది ఒక ప్రభుత్వం ఇచ్చిన అవార్డు.
అయితే అప్పటికే రాజకీయ పారావారాలుగా విడిపోయిన సోషల్ మీడియాలో ఒక వర్గం నామీద దాడి మొదలుపెట్టింది. ఆఖరికి ఈ ట్రోలింగు (అప్పుడే మొదటిసారి ఈ పదానికి వున్న పదును నాకు బోధపడింది) గొడవల్లో అభం శుభం ఎరుగని, చనిపోయిన నా ఇల్లాలిని కూడా ఇరికించి అభాండాలు వేశారు. నలభయ్ ఏళ్ళ జర్నలిజం కెరీర్ లో ఏనాడు ఇటువంటి అపప్రథకు గురికాని నాకు ఆ పరిణామాలు చాలా మనోవేదన కలిగించాయి. నా భార్య చనిపోయి బతికిపోయిందనే భావన కలిగింది. దానితో రాజకీయ రచనా వ్యాసంగానికి భరత వాక్యం పలికాను. ఇతరుల రాజకీయ పోస్టులు, అవి ఎంత సమ్మతంగా ఉన్నాసరే, వాటికి లైకులు కొట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ స్వచ్చందంగా మానేశాను. టీవీ చర్చల నుంచి తప్పుకున్నాను. ఒంటరి జీవితంలో కొంత ఉపశమనం ఇస్తున్న వ్యాసంగాన్ని వదులుకుని మళ్ళీ ఒంటరి గుహలో కూర్చుని నా జీవిత కధా రచనతో కాలక్షేపం చేస్తున్నాను.

కింది ఫోటో:
విశ్వనాధ సత్యనారాయణ గారు

No photo description available.

(ఇంకా వుంది)