6, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (214) : భండారు శ్రీనివాసరావు

 ముక్కు మాట్లాడుతుందా? ఏమో! గుర్రం ఎగరావచ్చు.  

జలుబు వెలగని బలుబు అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.

జలుబుకు, మాడిపోయిన బలుబుకి సంబంధం ఏమిటి అనుకునేవాడిని చిన్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు. ప్రాస కోసం రాశారేమో అనే అనుమానం కూడా రాకపోనూలేదు.

ఇప్పుడు అర్ధం అవుతోంది గత నాలుగు రోజులుగా నన్ను పట్టుకుని పీడిస్తున్న రొంప, తుమ్ములు, దగ్గులు  చూస్తుంటే.

ఈ నెల రెండో తేదీన నేనూ, జ్వాలా కలిసి కేవీపీ గారి కార్యక్రమానికి వెళ్ళాము. వచ్చేటప్పుడు నన్ను ఇంట్లో దింపి వెళ్ళాడు. చెడిపోయిన లిఫ్ట్ కారణంగా మూడు అంతస్తులు ముక్కుతూ మూల్గుతూ ఎక్కాను. బహుశా అప్పుడే ముక్కుకు నామీద కోపం వచ్చి వుంటుంది. మర్నాడు తెల్లవారగానే తుమ్ములు మొదలయ్యాయి. అదేమిటో జర్దా కిళ్ళీ వేసుకున్నవాడి పక్కన కూర్చొంటే ఆ ఘాటు సంగతేమో కానీ ఏదో సువాసన మనల్ని అలరిస్తుంది. అలాగే ఈ తుమ్ములు తుమ్మేవాడికి తుమ్మినప్పుడల్లా ఒక రకమైన రిలీఫ్. అదే పక్కన వున్నవాడికి భరించలేని అసహ్యం. గుడ్డిలో మెల్ల ఏమిటంటే నా తుమ్ములు పక్కవారిని  ఇబ్బంది పెట్టే సమస్యలేదు. లిఫ్ట్ లేదు కనుక అతిధి, అభ్యాగతులు  అనుకోకుండా వచ్చే వీలులేదు. అంచేత నా తుమ్ములు నేనే తుమ్ముకుంటూ ఆ రాత్రి గడిపేశాను. తోడు లేని వాడికి తుమ్ములు కూడా ఒక తోడే.

మర్నాడు మూడో తారీకు. మా రెండో కోడలు పుట్టింటి బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ వుంటే, తను ఊళ్ళో లేదు, కనీసం నేనన్నా వెడితే బాగుంటుంది అని వెళ్లి వచ్చాను.   

వచ్చేసరికి కొంత పొద్దుపోయింది. తుమ్ములకు తోడు రొంప, దగ్గులు మొదలయ్యాయి. తుమ్ముతూ చీదడం, చీదుతూ తుమ్మడం, దగ్గడం  రాగం తానం పల్లవి సరిపోయాయి. అదృష్టం కొద్దీ జ్వరం లేదు. పక్కవాళ్లు నేను ఏదో పాత నాగయ్య సినిమా చూస్తున్నానని అనుకుని వుంటారు.   

అలా మూడు రోజులు, కాలు గడప బయట పెట్టకుండా, మెట్లు దిగకుండా ఇంటి పట్టునే కాలక్షేపం.

మందు వేసుకుంటే ఏడు రోజుల్లో, వేసుకోకపోతే వారం రోజుల్లో తగ్గేది జలుబు అని ఒక పాత నానుడి వుంది. చూద్దాం మరో మూడు రోజులు. బయటకువెళ్లి వెలగబెట్టే రాచకార్యాలు ఏమున్నాయి కనుక?

ఇకపోతే ఇక్కడ మా ఆవిడ జ్ఞాపకం ఒఅక్తి.  దగ్గులు, పిండారీల కధలో ఈ పిడకల వేట ఏమిటంటారా! తప్పదు.

ఒక తరానికి చెందిన  భార్యాభర్తల నడుమ, ఒక వయసు వచ్చిన తర్వాత  మాటలు తక్కువ అనే అపకీర్తి సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.

కొన్నేళ్ళ క్రితం ఓ పెళ్ళికి ఖమ్మం వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి  మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప. ‘ అది నాకు తెలియదు. ఇంటి విషయాలు, ఇల్లాలి సంగతులు పట్టించుకోకపోవడమే కదా మన స్పెషాలిటి.

ఆ రాత్రి ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని పడుకుని వుంది.

పొద్దున్నే నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ పని చేసి వుంటుంది.

మనసుతో మాట్లాడ్డం అంటే ఇదేనేమో!

ఇంతకీ ముక్కుతో మాట్లాడం గురించి చెప్పలేదు కదా!

నాకు వచ్చే ఫోన్లు అతితక్కువ. అయినా కొన్ని రాంగ్ కాల్స్ వస్తుంటాయి. వాటిల్లో చాలా వరకు హెచ్.పి. గ్యాస్ కస్టమర్స్.  ఇదేదో కొత్త సమస్య కాదు, చాలా కాలంగా నడుస్తున్న కధే!

 నా మానాన నేను పాత పాటలు వింటూ, పాత సినిమాలు చూస్తూ ఏదో ఉబుసుపోక రాతలు రాసుకుంటూ వుంటే ఫోన్ మోగుతుంది. హెచ్ పీ గ్యాసా అంటుంది అవతల గొంతు. మొదట్లో తెలియక అమాయకంగా అవునండీ మాది హెచ్ పీ గ్యాసే అంటాను. మా సిలిండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ గొంతు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిఅప్పుడు వెలుగుతుంది లైటు. అబ్బే ఇది గ్యాస్ ఏజెన్సీ కాదండీ పర్సనల్ నెంబరు అని పెట్టేస్తే, మళ్ళీ ఫోన్ మోగుతుంది. మళ్ళీ అదే గొంతు. ‘అలా పెట్టేస్తారేమిటి, గూగుల్ సెర్చ్ లో ఇదే నెంబరు వుంది. కాదంటారేమిటి’ అని డబాయిస్తుంది. ఇలా  రోజుకు ఒకసారి కాదుఅనేక సార్లు. కొన్నేళ్లుగా ఇదే తంతు. గొంతు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి చికాకు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద చీకాకు పడతాను. తర్వాత జాలి కూడా పడతాను. గ్యాస్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. రాంగ్ నెంబర్ కావచ్చు. అవసరంలో వుండి ఫోన్ చేస్తున్నారు.  పోనీలే అనుకుంటే పోను కదా! నాకొచ్చిన ఇబ్బంది ఏముంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా చెబితే వచ్చిన నష్టం ఏముంది. ఇలా కాసేపు పశ్చాత్తాపపర్వం  నడుస్తుంది.  ఇంతలోనే మరో ఫోన్. ‘హెచ్ పీ గ్యాసా!’ నాలోని బుద్దుడు మాయమైపోతాడు. మళ్ళీ సీను రిపీట్.

ఒక రోజు అలా అప్పటికి మూడో ఫోను. ఇక వేరే దారి లేక కౌన్సెలింగ్ మొదలు పెట్టాను.

‘చూడండి. నేను మీలాగే హెచ్ పీ గ్యాస్ కన్స్యూమర్ ని. ఏజెన్సీ నడపడం లేదు. ఈ మధ్య గ్యాస్ బుకింగ్ విధానం సులభతరం చేశారు. 96660 23456 నెంబరుకు ఫోన్ చేయండి. ఒకటి నొక్కితే...’

నా మాట పూర్తికాకమునుపే అవతల గొంతు నా గొంతుకు అడ్డం పడింది.

‘ఇవన్నీ మాకూ తెలుసు. ఇలా చేయాలి అంటే ముందు మా ఫోన్, కన్స్యూమర్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ మా పేరుతొ లేదు. గూగుల్ సెర్చ్ లో నెంబరు చూసి చేసేది ఇందుకే

నాకు కళ్ళు తెరిపిళ్ళు పడాలి. కానీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆ జవాబుతో. కోపంతో కట్ చేశాను.

నాలోని తథాగతుడు మేలుకుని హితవు చెప్పడంతో మళ్ళీ కంప్యూటర్ లో తల దూర్చాను.

ఈసారి ఎక్కువ వ్యవధానం లేకుండానే ఫోన్ మోగింది. ‘హెచ్ పీ గ్యాసా!’

నేనూ ఈ సారి రూటు మార్చి నిదానంగా చెప్పాను. కాదండీ అన్నాను వినయంగా. ఒక విషయం చెప్పండి అని అడిగాను మరింత వినమ్రంగా. ఈ నెంబరు గూగుల్ సెర్చ్ లో దొరికింది అంటున్నారు. ఏమీ అనుకోకపోతే ఆ స్క్రీన్ షాట్ నా ఈ నెంబరుకు పంపిస్తారా శ్రమ అనుకోకుండా

ఇంత మన్ననగా కోరేసరికి అతడు సరే అన్నాడు. సరేతో సరిపుచ్చకుండా పంపాడు.

అది చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఒక్క అంకె తేడా లేకుండా అది,  పాతికేళ్ళుగా నా పేరు మీద బిల్లులు కడుతూ నేను  వాడుతున్న  నా పర్సనల్ నెంబరే!

ఇప్పుడు జలుబు శకం నడుస్తోంది కదా! ఏది మాట్లాడినా ముక్కుతోనే. గ్యాస్ వాళ్లకు కూడా ముక్కుతోనే జవాబు.  

 

(06-09-2025)     

3, సెప్టెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (213)– భండారు శ్రీనివాసరావు

 గతి తప్పిన వర్తమానం

‘ఇలా కాదు, ఒకరోజు మీ ఇంటికి వస్తాను, చాలా రోజులుగా వాయిదా పడుతోంది. ఈసారి తప్పకుండా వస్తాను’ అన్నారు నాతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.
హడావిడిలో వుండి కూడా కాసేపు నిలబడి ఆప్యాయంగా మాట్లాడారు. బాధ్యతలు ఎక్కువ. ఈరోజు హైదరాబాదు, మర్నాడు ఢిల్లీ. మరో రోజు ఖమ్మం. మధ్య మధ్యలో గంటలకు గంటలు సమీక్షా సమావేశాలు. అనుకుంటారు కానీ మంత్రుల కష్టాలు మంత్రులవి.
‘మీ ఇంటికి వస్తాను’ అన్నవారిని గట్టిగా ‘అవును, రండి’ అని అనలేని పరిస్థితి నాది. ఇంట్లో కప్పు కాఫీ ఇచ్చే దక్షత లేదు. చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, ‘రేపు కలుద్దాం’ అని. నేనే ఏదో వంక చెబుతాను. 'దాటవేస్తున్నాను' అని తెలిసిపోతూనే వుంటుంది.
పాతికేళ్ళ నాటి లిఫ్ట్ పడకేసి పక్షం రోజులు అయింది. బాగు చేయించే, బాగుపడే సూచనలు ప్రస్తుతానికి కనపడడం లేదు. మూడు అంతస్తులు ఎక్కి దిగాలంటే అదో ప్రయాస. ఎక్కిదిగమని చెప్పడానికి నామోషీ. ఇవన్నీ వెళ్ళబోసుకోవడం ఇష్టం లేక ఏదో కారణం చెబుతాను.
మిత్రుడు Ramnath Kampamalla మొన్నొకరోజు నన్ను చూద్దామని వచ్చి మూడు అంతస్తులు ఎక్కి కాలింగ్ బెల్ కొట్టి, రెస్పాన్స్ లేక పాపం మళ్ళీ అన్ని మెట్లు దిగి వెళ్లిపోయారట. ఇట్లావుంటుంది నాతోని.
అందుకే నెలకో రెండు నెలలకో ఒకసారి మిత్రులను కలిసే సందర్భం చూసుకుని ఇటువంటి సమావేశాలకు వెడుతుంటాను.
నిన్న అలాగే కేవీపీ రామచంద్రరావు గారు పిలిస్తే, జ్వాలాతో కలిసి వై.ఎస్.ఆర్. అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లాను. దశపల్లా హోటలు హాలు మొత్తం వచ్చిన అతిధులతో కిటకిటలాడుతోంది.
వై.ఎస్. చనిపోయి పదహారేళ్ళు. రాజకీయాల్లో ప్రాణం కాదు, పదవి పోతేనే మొహం చాటేసే రోజుల్లో ఇంతమంది జనం. నిజంగా అబ్బురం.
అనుకున్నట్టే ఒకనాటి పాత్రికేయ మితృలు అందరూ ఒక చోటనే కలిసారు. వీరువారని లేదు. చాలామందిమి కలిశాము. ఒకానొక రోజుల్లో రోజూ కలిసేవాళ్ళం సచివాలయంలోనో, పార్టీల ఆఫీసుల్లోనో. ఒకరినొకరం పలకరించుకుని సంతోష పడ్డాము. అలాగే పాత తరం రాజకీయ నాయకులు. కొత్తతరం వాళ్ళు. పాత వారితో గట్టి పరిచయం. కొత్తవారితో ముఖ పరిచయం.
కేవీపీ గారు అమ్మాయి పెళ్లి చేసే వధువు తండ్రి మాదిరిగా అందరినీ పేరుపేరునా పలకరిస్తున్నారు. బాగా అలసిపోయినట్టు మొహం చూస్తేనే తెలుస్తోంది. కానీ వై.ఎస్. తో ఆయనకు వున్న మిత్రబంధం అలసటను అధిగమించిందని అనిపించింది.
ప్రసంగం మధ్యలో షర్మిల రాక గమనించిన ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారు, ‘వేదిక మీదకు వచ్చి కూర్చోండి, నా కుర్చీ ఖాళీగానే వుంది’ అనడం ఒక విశేషం.
గతంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక మంచి పనులను గురించి వక్తలు అందరూ ఏకధాటితో ప్రసంశలు కురిపిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదనే దాదాపు రెండు గంటలు ప్రశాంతచిత్తంతో వినడం, కేవీపీ గారు తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు, ఈనాటి రాజకీయాల్లో గొప్ప విషయమే.
మాట్లాడిన వాళ్ళు, విన్న వాళ్ళు వై.ఎస్. గురించిన తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఘనమైన మనిషికి ఘనమైన నివాళి.
“బాగా తగ్గిపోయారు” అన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు సభ ముగిసిన తర్వాత నేను కనిపిస్తే.
“అవునండీ! టీవీ చర్చలు పూర్తిగా తగ్గించుకున్నాను” అనబోయాను.
“యంగెస్ట్ జర్నలిస్ట్. ఏజ్ ఎనభై ఓన్లీ" అన్నారు పక్కనుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు.
“నిజమా! ఏమిటి రహస్యం”
“అది ఇక్కడ చెప్పేది కాదు లెండి” అని తప్పించుకున్నాను.
వై ఎస్. జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టాలతో ఫోటోగ్రాఫర్ మిత్రుడు రవీంద్ర రెడ్డి సారధ్యంలో ఏర్చి కూర్చిన ఫోటో ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
చాలా రోజుల తర్వాత ఆహ్లాదంగా, ఆనందంగా గడిచిన సాయంత్రం.
ఇంతకీ చెప్పాలి అనుకున్నది ఏమిటంటే...
నేను రేడియో విలేకరిని.
నా పరిధి మించి ఒకరిని పొగుడుతూ రాయలేను. అలాగే హద్దులు దాటి తెగడలేను.
గోడమీద పిల్లి అన్నా బాధ పడను.
ఈ విషయం నా కంటే, నాతో మంచి పరిచయం వున్న రాజకీయ నాయకులకే బాగా తెలుసు.
నేను నా స్కూటర్ కిందే పడి కాలు విరగగొట్టుకుని, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి కోలుకుంటున్నప్పుడు అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు గారు, అతి కీలకమైన లోకసభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా వుండి కూడా తీరిక చేసుకుని నన్ను చూడడానికి ఆసుపత్రికి వచ్చారు. యోగక్షేమాలు కనుక్కున్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు, విలేకరుల ఇష్టాగోష్టి సమయంలో నా గురించి ఒక విలేకరి, ‘శ్రీనివాసరావు పొద్దస్తమానం సీ ఎం చంద్రబాబు ఆఫీసులోనే వుంటాడు’ అని వ్యంగ్యంగా అంటే, వై.ఎస్. ఆర్. గారు ఆప్యాయంగా నా భుజం మీద చేయి వేసి, ఆ విలేకరిని వారించిన సందర్భం, నన్ను సమర్థిస్తూ మాట్లాడిన వైనం నేనెన్నడు మరచిపోలేను.
వారి హోదాలకు తగిన రీతిలో పిలవకపోయినా, ఆ ఇద్దరు, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వుంటూ, పాత్రలు మారిన తర్వాత కూడా నా ఇద్దరు పిల్లల పెళ్లిళ్లకు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించడం వారి మంచితనం, గొప్పతనం.
2005 డిసెంబరు 31 వ తేదీన హైదరాబాదు దూరదర్సన్ నుంచి రిటైర్ అయ్యేవరకు, ఏ పత్రికకు ఏనాడు రాజకీయ వ్యాసాలు రాయలేదు. ఏ టీవీ చర్చల్లో పాల్గొనలేదు. ఒక మీడియాలో పనిచేస్తూ వేరే మీడియాలో పాల్గొనడం నాకు ఇష్టం వుండేది కాదు.
ఆ తర్వాత నేను పాల్గొనని టీవీ లేదు, రాయని పత్రిక లేదు.
అలా సంవత్సరాల తరబడి మూడు పూటలా రోజుకో టీవీ చర్చలకు వెడుతుండే నాకు వారాలబ్బాయి అని పేరు కూడా పెట్టారు. ఇక వెబ్ ఛానల్స్ అనంతం. వాళ్ళు ఏ అంశం మీద అడిగినా చప్పున వ్యాఖ్యానించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండేవాడిని. అనేక ఛానల్స్ మా ఇంటి నుంచే ఓబీ వ్యాన్లు పంపి లైవ్ తీసుకునేవి.
రా వద్దని ఏ టీవీ అనలేదు, రాయవద్దని ఏ పత్రిక వాళ్ళు అనలేదు.
మాట్లాడడం ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే మంచి వక్త కాగలుగుతాడు. రాయడం ఎప్పుడు ఆపాలో గ్రహించిన వాడే మంచి రచయితగా మిగిలిపోతాడు. ఇలాంటి సూక్తులు అన్నీ అనేకం రాసిన నేను, ఒకరోజు శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ చర్చలకు మంగళం పాడేసాను. మారిన పరిస్థితులు, మారుతున్న పరిస్థితులు, మారబోయే పరిస్థితులు కొంత కారణం అనుకోండి. ఇక చాలు అనుకున్న తరువాత, ఆశ్చర్యంగా దిగజారుతున్న నా ఆరోగ్యం బాగుపడింది. హాయిగా ఇంటిపట్టున కూర్చుని, నా మానాన నేను నా సొంత సంగతులు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను.
ఇప్పటికి నా బిగ్ జీరో అక్షరాలా రెండువందల పన్నెండు భాగాలు పూర్తయ్యాయి. తరువాత కొంత గ్యాప్ వచ్చింది. కారణం నా మనుమరాలు జీవిక.
తనని చూడడానికి గణేష్ చతుర్థికి కటక్ వెళ్ళాను. వున్నది నాలుగు రోజులే. సెలవులు కావడం వల్ల తనతోనే కాలక్షేపం. దానితో సర్వం మరచిపోయాను. తాతా తాతా అంటూ నా చుట్టూనే తిరిగేది. నా పక్కలోనే నిద్రపోయేది. నిద్ర పట్టని నాకు ఒకటే ఆలోచన. నా పిల్లలతో కూడా నేనిలా సన్నిహితంగా, ప్రేమగా మసలిన సందర్భాలు అతి తక్కువ. కాదు, కాదు, అసలు లేవనే చెప్పగలను. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు. సృష్టి చేసే మాయల్లో ఇదొకటి.
కింది ఫోటోలు పలాన పలానా అని రాయనవసరం లేనివి.
(Some photos Courtesy: Ramnath Kampamalla)















(ఇంకా వుంది)


24, ఆగస్టు 2025, ఆదివారం

కార్టూనిస్ట్ శంకు ఇక లేరు

 నిన్న శనివారం ఉదయం 7.08 గంటలకు  శుభోదయం చెబుతూ, కార్టూనిస్టు శంకు గారి నుంచి  మెసేజ్.

మళ్ళీ 9.02 లకు మరో మెసేజ్ దూరదర్సన్ యాదగిరి చూస్తున్నారా? అని. దురదృష్టం! ఈ రెండూ చూడలేదు.

శంకు లేరంటూ ఈ రోజు మిత్రుడు సుధామ పెట్టిన చావుకబురు మాత్రం కంటబడింది. 

అప్పుడు  వాట్సప్ ఓపెన్ చేసి చూస్తే శంకు గారి మెసేజ్ లు వరుసగా.

“శుభోదయం! కార్టూన్ కబుర్లు- శంకు గారితో    పరిచయం. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు 

“డీడీ యాదగిరిలో...”

ఇక శంకు గారిని డీడీ ఇంటర్వ్యూలోనే చూడాలి.




23, ఆగస్టు 2025, శనివారం

తెలుగుదేశం పత్రిక

పాత తరం జర్నలిస్టులకు గుర్తుండే వుండాలి. చెన్నారెడ్డి  మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కాంగ్రెస్ లో గ్రూపు తగాదాల కారణంగా బొద్దులూరి రామారావు అనే ఎమ్మెల్యే (కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు.  ఆయన స్వగ్రామం రామిరెడ్డి పల్లె  మా ఊరు దగ్గరే.)  అచ్చు చెన్నారెడ్డి గారిని అనుకరిస్తూ నల్లకళ్ళ జోడు ధరించి, పొన్నుకర్ర  విలాసంగా ఊపుకుంటూ అసెంబ్లీలో హడావిడి చేస్తూ విలేకరుల దృష్టిని ఆకర్షిస్తూ ఉండేవాడు. మంచి వక్త, మాటకారి. బెజవాడ దగ్గర కొండపల్లి వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమలకు సంబంధించిన ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కొంతకాలం చైర్మన్ గా పనిచేశారు కూడా. ఈ తెలుగుదేశం పత్రికకు ఈ రామారావు గారికి సంబంధం ఏమిటంటారా! ఈ పత్రిక ఎడిటర్ సూర్యదేవర రాజ్యలక్ష్మి దేవి ఈయనకు దగ్గరి బంధువు.  ఈ పత్రిక ప్రచురణ  విజయవాడ నుంచి అయినా, ఆ రోజుల్లోనే  హైదరాబాదులో  కార్యాలయం వుండేది. 

ఆగస్టు ఎనిమిది ఆవిడ  వర్ధంతి. ఆ నాడు నాకు ఈ తెలుగుదేశం పత్రిక ఫోటోతో పాటు రాజ్యలక్ష్మి గారి గురించి కొన్ని వివరాలు వాట్సప్ లో పంపారు. రాజ్యలక్ష్మి దేవి స్వతంత్ర సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం సంస్థానానికి విముక్తి దొరకలేదు. నిజాం వ్యతిరేక పోరాట నాయకులకు సంఘీభావం తెలిపి వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు.  2010 ఆగస్టు ఎనిమిదిన ఆమె మరణించారు.



(PHOTO COURTESY: SHRI BODDULURI RAMARAO, Ex. MLA) 


20, ఆగస్టు 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (212)– భండారు శ్రీనివాసరావు

 ఇంటింటి రామాయణం

 

‘ఫ్రిజ్ పనిచేయడం లేదు

మొన్న ఉదయం వంటకు  వచ్చినప్పుడు వలలి వనిత చెప్పింది. ఫ్రిడ్జ్ లో లైట్ వెలగడం లేదట.

ఇంట్లో ఏమి జరుగుతోంది అనేది ఎవరైనా వచ్చి చెప్పేవరకు నాకు తెలియదు. అదీ నా మేనేజ్ మెంట్ స్థాయి.  

అంతకు ముందు ప్లంబరు కోసం యాతన, తర్వాత గ్యాస్ స్టవ్, ఇప్పుడు ఫ్రిజ్, రేపు మరోటి. ఎస్సారార్ కాలేజీలో ఇకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు చెప్పేవారు, మిషన్ ఆల్వేస్ ఫెయిల్స్ అని. యంత్రం అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు రిపైర్ కు రాక తప్పదు అని వారి భావన.   

రిపేర్లకే వేలకు వేలు ఖర్చు. వచ్చి చూసినందుకు ఇంత, తెరిచి చూస్తే కొంత,   ఇది పోయింది, అది పోయింది అని మరికొంత, ఇది కొనాలి, అది కొనాలి  అని ఇంకొంత,  చివరికి పని పూర్తి చేసినందుకు మరింత.  పైగా ఎప్పుడు వస్తారో తెలియదు, వచ్చిన దాకా భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూచోవాలి.

ఈ సమయంలో మా పెద్దక్కయ్య కుమారుడు, కీర్తిశేషుడు డాక్టర్ ఏపీ రంగారావు గుర్తుకు వచ్చాడు. ఆయన చేసిన ఆలోచనలు స్పురణకు వచ్చాయి.

ముందు ఫ్రిడ్జ్ గొడవ చూద్దాము.

దగ్గరలో వున్న ఫ్రిజ్ మెకానిక్ ఎవరు అని గూగుల్ ని అడిగాను. అది చెప్పిన నెంబరుకు ఫోన్ చేశాను.  ఒక నెంబరు చెబుతా రాసుకోండి అంది ఆ నెంబరు. చేస్తే జవాబు లేదు. చేయగా చేయగా ఒక అరగంటకు దొరికాడు.  ‘దూరంగా వున్నాను,  లొకేషన్ పంపండి, రావడానికి రెండు గంటలు పడుతుంది అన్నాడు. అన్నాడు కానీ నాలుగు గంటల తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు. చూశాడు. విప్పాడు. చెప్పాడు.

‘రెండు చిన్న పరికరాలు పాడయ్యాయి. ఒకటి 1250, మరోటి 1850. రిపైర్ చార్జీ  450, తర్వాత పని తీరు నచ్చితే పండగ మామూలు మీ ఇష్టం’ అన్నాడు.

‘ఊ’ అనడం తప్పిస్తే మా బోంట్లకు చేసేది ఏముంది. ‘బాగా రిపైర్ చేసి పెట్టు, మళ్ళీ నీ పేరు మరొకరికి చెప్పేలా’ అన్నాను, కాసింత ఉత్సాహం కలిగిస్తూ. బాసింపట్టు వేసుకుని పని మొదలు పెట్టాడు. నేను ఓ కుర్చీ దగ్గరకు జరుపుకుని కూచున్నాను, ఈ పని అయిపోతే భోజనం చేయాలి.

మొన్న స్టవ్ రిపైర్ కు వచ్చిన వాడు ఇంతే! మోటారు సైకిల్ కు మైకు తగిలించుకుని స్టవ్ రిపైర్, స్టవ్ రిపైర్ అని అరచుకుంటూ పోతుంటే మూడో అంతస్తులో వున్న నాకు వినపడింది. నిజానికి నాకు రిపైర్ అవసరం లేదు, కాస్త క్లీన్ చేస్తే చాలు. వాచ్ మన్ ని పంపి పిలిపించాను. క్లీనింగ్ చేస్తే చాలు అన్నాను.

‘అగ్గిపెట్టె వుందా’ అన్నాడు. ఆ సందర్భంలో ఆ జవాబు అసందర్భం అనిపించింది. అయినా దేవుడి మందిరంలోని అగ్గిపెట్టె తెచ్చి ఇచ్చాను. అతడు స్టవ్ వెలిగించి  ఓ అగ్గిపుల్ల గీసి నాలుగు  బర్నర్ల చుట్టూ తిప్పాడు. బర్నర్ల నుంచి నీలిమంటలు వచ్చాయి. ‘చూశారా! గ్యాస్ లీక్ అవుతోంది.  వీటి నాబ్స్ మార్చాలి’ అన్నాడు. ఇది ఇంత, అది ఇంత అని చెప్పి కొత్తవి వేసి (అన్నీ అతడు వెంట తెచ్చుకున్న బ్యాగులోనే వున్నాయి), బాగయింది చూసుకోండి అని మళ్ళీ వెలిగించి చూపించి, 3, 200 పట్టుకుపోయాడు. పోతూ పోతూ, పాలు పొంగినప్పుడల్లా వెంటనే ఓ బట్టతో శుభ్రం చేయండి, ఈ సమస్య రాదు అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చి మరీ పోయాడు. ఇదంతా పూర్తయ్యేసరికి సాయంత్రం అయిదున్నర. అప్పుడు భోజనం.

ఇదంతా గుర్తుకు వచ్చి ఫ్రిడ్జ్ రిపైర్ కు వచ్చిన  మనిషితో అన్నాను. ‘ఇంత ఖర్చు పెట్టేబదులు కొత్తది కొనుక్కుంటే పోలా’ అని. అతడు వెంటనే జవాబు చెప్పాడు. ‘కొనుక్కోవచ్చు, నలభయ్ వేలు అవుతుంది. ఇది 2008 మోడల్. నేను ఈ కంపెనీకే పనిచేస్తాను.  అప్పటి మోడల్స్ పనిచేసినట్టుగా ఇప్పటివి పనిచేయడం లేదు. చిన్న చిన్న రిపైర్లు వచ్చినా చాలా కాలం పనిచేస్తుంది అని.  కొత్తది కొనే బదులు నాలుగువేల రిపైర్ బెటర్ అని నా మైండ్ ని ట్యూన్ చేశాడు, తన మార్కెటింగ్ తెలివితేటలతో.

సరే! అతడు ఆ పనిచేసి ఫ్రిడ్జ్ లో లైట్ వెలిగించేసరికి ఇంట్లో దీపాలు వెలిగించే వేళ అయింది. కార్తీకం కాకపోయినా ఒక పూట ఉపవాసం.  

ఇప్పుడు డాక్టర్ రంగారావు గారి ఆలోచనల సంగతి చెప్పుకుందాం.  

రెండు దశాబ్దాల కిందటి సంగతి.    

 

అప్పుడు మా పిల్లలు బయటి ఊళ్లలో ఉద్యోగాలు చేస్తుంటే, మా ఆవిడా నేనూ ఒంటరిగా కాపురం వెలిగిస్తున్న రోజుల్లో  ఒక సమస్య ఎదురయింది.  సమస్య కాదు, ఇబ్బంది. నిజానికి చాలా చిన్న సమస్య. కానీ పరిష్కారం వెనువెంటనే కనబడక పోవడంతో అది క్షణక్షణానికి పెరిగి పెద్దదయింది.

ఇంట్లో కరెంటు పోయింది. ‘ఇంట్లో’ అని ఎందుకు అంటున్నాను అంటే అపార్ట్ మెంట్లో కరెంటు  వుంది. మా ఫ్లాట్ లోనే పోయింది. పోయిందా అంటే పూర్తిగా పోలేదు. ‘వస్తావు పోతావు నాకోసం’ అన్నట్టు ఒక క్షణం పోతుంది. మరు నిమిషం వస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడే కరెంటుతో, ఆ కరెంటుతో నడిచే ఉపకరణాలకు నష్టమని పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుతూ నేనూ మా ఆవిడా అవస్థ పడుతూ పరిష్కారం ఎలా అని ఆలోచించాము. కరెంటు అవస్థలు తగ్గిన కాలం కాబట్టి, ఆపద్ధర్మ లైట్లు, కొవ్వొత్తులు ఇంట్లో కనబడకుండా పోయాయి. ఏ ఎలక్ట్రీషియన్ కు ఫోను చేసినా బిజీ బిజీ. ఎవ్వరూ దొరకలేదు. ఈ వచ్చీ రాని కరెంటుతో రాత్రి గడపడం యెట్లా అనుకుంటూ వుంటే మా వాచ్ మన్ ఎవరో ఇద్దర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మా పక్క అపార్ట్ మెంట్లో మొన్నీ మధ్యనే దిగారట. ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లకి ఆ ఇల్లు మా వాచ్ మనే కుదిర్చిపెట్టాడుట. ఆ పరిచయంతో వాళ్ళని రాత్రి పదిగంటలకు వెంట బెట్టుకు వచ్చాడు. ఆ ఇద్దరు కాసేపు చూసి ఏం మాయ చేసారో కాని, మా ఇన్వర్టర్ లో ఒక లోపాన్ని పసికట్టారు. దాన్ని సరిచేసి ఇంట్లో వెలుగు నింపారు.

మా సమస్య తీరింది కానీ మరో సమస్య. చూడబోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళలా వున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం అంటే చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపడం ఎలా!

చివరికి మా ఆవిడే కల్పించుకుని మాకు అంతకు ముందు రోజే ఎవరో పంపిన ఖరీదైన పళ్ళ బుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టి సాగనంపింది. ఈ నేపధ్యంలో, డాక్టర్ రంగారావు గారికి ఒక ఆలోచన వచ్చింది.

అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి.

ఆయన సరిగ్గా ఇదే కోణంలో  ఆలోచించారు. సామాన్య మనుషులకు  ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి టెన్షన్. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న సమస్య పెద్దదిగా కనబడి మరింత పెద్దది అవుతుంది. దానితో పెరిగిన టెన్షన్ తో అనారోగ్యం పెరిగి పెద్దది అవుతుంది. దీనికి పరిష్కారం కనుగొంటే బీపీ షుగర్ వంటి వ్యాధులకు మొదట్లోనే అడ్డుకట్ట వేయవచ్చన్నది ఆయన ఆలోచన. అది చిటికెలో, చౌకలో  అయ్యే పరిష్కారం అయితే మహాబాగు.  

ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న సంసారాలు ఏర్పడుతున్న తరుణంలో ఎదురయిన సమస్యలని ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సి వుంటుంది. మునుపటి రోజుల్లో ఇంట్లోనే ఎవరో ఒకరు చేయి వేసేవాళ్ళు. ఫోను చేస్తే 108 అంబులెన్స్  వచ్చినట్టు, ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా మనకు కావాల్సిన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లు మొదలయిన పనివాళ్ళని ఫోను చేసి ఇంటికి పిలిపించుకునే సౌకర్యం అన్నమాట. సరే ఈనాడు అంటే ఇరవై ఏళ్ళ తర్వాత అర్బన్ క్లాప్స్ వంటి యాప్స్ వచ్చాయనుకోండి. నేను చెప్పేది ఇలాటి సంస్థలు ఏవీ లేని కాలంలోని ముచ్చట. పైగా వినియోగదారుడికి చేతి చమురు  వదలాల్సిన అక్కర లేని ముచ్చట. పెద్ద చదువు లేకపోయినా ఇటువంటి మరమ్మతులు సొంత తెలివితేటలతో చక్కబెట్టగల పనివారికి కొరతలేని దేశం మనది. కాకపోతే వారికి స్థిరమైన ఆదాయం వుండదు.

అటువంటి పనివారి వివరాలను ముందు జంట నగరాలలో ఆ రోజుల్లోనే ఏరియా వారిగా వారి టెలిఫోన్ నెంబర్లతో సహా సేకరించడం జరిగింది. 108, 104 లాగానే ఈ సర్వీసులకు కూడా ఒకే  టోల్ ఫ్రీ నెంబరు వుంటుంది. ప్రభుత్వం లేదా ఒక గుర్తింపు పొందిన వ్యవస్థ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన వాళ్ళు,  వచ్చిన పని కాకుండా ఇంట్లో ఉన్న ముసలీ ముతక మీద అఘాయిత్యానికి పూనుకునే అవకాశం వుండదు.  వచ్చిన పని చేస్తూనే ఇంట్లో ఖరీదైన వస్తువులను చక్కబెట్టుకుని పోయే వీలుండదు. చిన్నా చితకా పనులన్నీ, పెద్ద అవస్థలు పడకుండా జరిగిపోతూ ఉండడంతో  జనంపై మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి.

అయితే అనేక మంచి పధకాల మాదిరిగానే ఇది కూడా అటకెక్కింది.

ఇతి వార్తాః 

కింది ఫోటో:

ఫ్రిడ్జ్ మెకానిక్ శ్రీనివాస్



(ఇంకావుంది)

17, ఆగస్టు 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (211 ) : భండారు శ్రీనివాసరావు

 ముందే మోగిన గంట

డ్రైవరు వచ్చి చాలా సేపు అయింది. రెండూ దూరాలే. గంట పైన పడుతుంది. ఇంకా తయారు కాలేదేమిటి” అన్నాను అసహనంగా.

పనమ్మాయిని తోడు ఉండమని చెప్పాను. మీరూ సంతోషు వెళ్లి రండి. నాకు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది” అన్నది మా ఆవిడ.

నాకు తల తిరిగి పోయింది. పెళ్ళయిన ఈ నలభయ్ అయిదేళ్ళలో ఎన్నడూ ‘మీరు వెళ్ళండి, నేను ఉండిపోతాను’ అనే మాట ఆమె నోట వినబడలేదు. మా చుట్టపక్కాల్లో పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమి జరిగినా ముందుండేది తనే, నేను కాదు.  మా పెద్దన్నయ్యపర్వతాల రావు గారి   మనుమరాలు పెళ్లి. అంతకు ముందు జరిగిన మెహందీ మొదలైన  కార్యక్రమాలకు కూడా  వెళ్లి,  పగలల్లా అక్కడే వుండి  వచ్చింది కూడా. శనివారం రాత్రి రెండు పెళ్ళిళ్ళు.  రెండూ తప్పకుండా వెళ్లాల్సినవే కాదు, దగ్గర వుండి కనుక్కోవాల్సిన పెళ్ళిళ్ళు. ఒకటి మా పెద్దన్నయ్య మనుమరాలు అపర్ణ పెళ్లి. రెండోది మా చిన్న మేనల్లుడు కొమరగిరి రఘురాం  కొడుకు వివాహం. చుట్టాలందరం రెండింటికీ వెళ్లాలని తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఏడెనిమిది గంటలు వుండాలి, అప్పగింతలూ అవీ అయి తిరిగొచ్చేసరికి తెల్లారుతుందని ముందరే డ్రైవరుకు చెప్పి పెట్టాం. అతడూ వచ్చాడు. వచ్చిన తరువాత ఇదీ పరిస్తితి.

అపోలోలో పనిచేస్తున్న డాక్టరు బాబీకి ఫోను చేసాం. అతడు కొన్ని వివరాలు అడిగి యేవో మందులు చెప్పాడు. వేసుకుని పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని సలహా చెప్పాడు. డాక్టరు కదా! షరా మామూలుగా కొన్ని టెస్టులు చేయించమన్నాడు. డ్యూటీ కాగానే వచ్చి చూస్తానని అన్నాడు.

అంతే! పెళ్లిళ్లకు వెళ్ళడం మానుకుని, డ్రైవర్ని పంపించేసి, మా వాళ్లకు వివరం చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాం.

కాల్ హెల్త్  కు ఫోన్ చేస్తే, వాళ్ళ తాలూకు మనిషి ఇంటికి వచ్చి రక్తం నమూనాలు పట్టుకు పోయాడు.

పూర్తి విశ్రాంతి తీసుకుని, డాక్టరు చెప్పిన మాత్తర్లు వేసుకుని పడుకుంటే ఉదయానికి కాస్త తెప్పరిల్లింది. అని తనే  చెప్పింది. మనం నమ్మాలి.

అది ఆగస్టు మాసం 12 తేదీ, 2017 వ సంవత్సరం.  

మరో ఆగస్టు వచ్చిందీ, పోయింది. ఆ తర్వాత ఆగస్టు వచ్చి పోతూ పోతూ మా ఆవిడని తీసుకుపోయింది.

2019 ఆగస్టు 17 రాత్రి పదిగంటలు.

మామూలుగా నిద్రపోవడానికి ముందు, డబ్బూ డుబ్బూ లేకుండా సరదాగా ఓ పదాటలు కార్డ్సు ఆడటంఅలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు కార్డ్సు ఆడుదామా అని తను అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. ఎప్పుడూ ఘంటసాల పాత పాటలు వచ్చేవి. ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది.

తల నొప్పిగావుంది, అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం నాది.  తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళుకాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ కు కబురు చేశాను. బాత్ రూం కు పోతానంది.  లేచి నిలబడ్డప్పుడు అడుగులు తడబడుతుంటే,  నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. అబ్బాయికి, కోడలుకి  బెంగుళూరులో ఉద్యోగాలు. ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను.   48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 


ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావు కబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!

అపోలో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ బాబీ ( మా ఆవిడ అక్కయ్య విజయ గారి కుమారుడు) మా కుటుంబంలో ముఖ్యులకు వార్త చేరవేశాడు. నేనక్కడ ఒక శిలా విగ్రహంలా మా ఆవిడ స్ట్రెచర్ పక్కన కూర్చుని వున్నాను. కొద్దిసేపట్లోనే వూళ్ళో వున్న మా కుటుంబ సబ్యులు చాలామంది ఆ తెల్ల్ల్లవారుఝామునే ఆసుపత్రికి చేరుకున్నారు. పలకరిస్తున్నారు, పరామర్సిస్తున్నారు. పూర్తి  అయోమయంలో నేను.

కబురు తెలియగానే బెంగుళూరులో వున్న నా కొడుకు, కోడలు దొరికిన బస్సు పట్టుకుని ఆఘమేఘాల మీద హైదరాబాదు చేరుకున్నారు, మంచు పెట్టెలో దీర్ఘనిద్రలో వున్న మా ఆవిడని చూడడానికి. ఎక్కడో సుదూరంగా అమెరికాలో వుంటున్న మా పెద్దవాడు సందీప్ కుటుంబంతో కలిసి దొరికిన ఫ్లయిట్ పట్టుకుని హైదరాబాదు బయలు దేరాడు.

మా అన్నయ్య నన్ను మా ఇంటికి పోనివ్వలేదు. పన్నెండు రోజులు వాళ్ళ ఇంట్లోనే వున్నాను. నన్ను చూడడానికి చుట్టాలు పక్కాలు, స్నేహితులు  అందరూ అక్కడికే వచ్చారు. కొన్ని రోజుల వరకూ మా అపార్ట్ మెంటులో వారికి ఈ విషయం తెలియనే తెలియదు. అందరూ నిద్రపోతున్న సమయంలో మేము అంబులెన్సులో బయటపడ్డాము. మర్నాడు కనబడకపోతే,  మా అన్నగారింటికో, ఊరికో వెళ్లామని అనుకున్నారట. అంత నిశ్శబ్దంగా జరిగింది ఆఖరి ప్రయాణం.

అందరూ వచ్చారు. ఎక్కడెక్కడినుంచో ఆఖరి చూపులకోసం. ఎవరికీ నమ్మకం కుదరడం లేదు, కబురు పొరబాటున విన్నామా అని అనుమానం.  

 

జూబిలీహిల్స్ మహా ప్రస్థానంలో లో అంత్యక్రియలు. కొడుకులు చేస్తూ వుంటే నేను చూస్తూ కూర్చొన్నాను.

ఎగసి పడుతున్న మంటల మధ్య కాలి బూడిద అవుతుంటే బాధ అనిపించడం లేదా!

నాకు ఏడుపు రాలేదు. కంట్లో నీటి చుక్కలేదు. నేను మనిషినేనా!    

ఆవిడ లేకుండానే  రెండేళ్లు గడిచాయి.

అధిక మాసాలు, బహుళ పక్షాలు ఇలాంటివి ఎప్పటికీ నా బుర్రకు ఎక్కవు.

ఇంగ్లీషు  తేదీలు కాకుండా తెలుగు తిథుల  ప్రకారం వార్షికాలు జరపడం ఆచారం. అందుకే పురోహితుల వారికి ఫోను చేశాను.

శర్మ గారు. ఎల్లుండి.....’

అయ్యో! కొంచెం ముందు చెప్పక పోయారా! ఆ రోజు నేను ఓ కార్యక్రమానికి ఒప్పుకున్నాను’

అలానా! మా ఆవిడ మూడో ఆబ్ధీకం ఆ రోజు. తిథుల ప్రకారం ముందుకు వచ్చింది. అంచేత మీకు ముందుగా..’

అమ్మగారిదా! భలే వాళ్ళే! వేరే ఎవరినైనా ఒప్పుకున్న కార్యక్రమానికి పురమాయించి నేనే వస్తాను. అరిటాకులు, దర్భలు అన్నీ పట్టుకు వస్తాను. ఇద్దరు భోక్తలను కూడా వెంట బెట్టుకు వస్తాను. మీరు నిశ్చింతగా వుండండి. అంతా సలక్షణంగా జరిపిస్తాను, నాదీ పూచీ’

బతికి ఉన్న నా మాట కంటే, చనిపోయిన ఆమెకే ఎక్కువ విలువ అనే విషయం తెలిసింది.

సంఘంలో భార్యకు వున్న గౌరవాన్ని చూసి గర్వపడే అవకాశం భర్తలకు ఇలా కూడా దొరుకుతుందన్న మాట.



(17-08-2025)