3, మే 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (156) – భండారు శ్రీనివాసరావు

 

దేశాన్ని కరోనా పట్టి  పీడిస్తున్న రోజులు.  జనమంతా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియక తమని గురించే తామే మధన పడుతున్న రోజులు. రోజు ఎలా గడుస్తుందో అని రోజులు  లెక్క పెట్టుకుంటున్న రోజులు.

2020 మే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.

భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”

వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసుకానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.

శ్రీనివాసరావు గారు ఎలా వున్నారునేను వెంకయ్య నాయుడిని”

నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”

నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయానువెరీ సారీ”

“..........”

హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”

అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”

ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”

“....................”

ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”

చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”

నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”

తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను?

2020  సంవత్సరం మే నెల  12 వ తేదీ.  

నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి  స్వచ్చమైన హిందూస్థానీలో.

కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.

“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.

“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.

“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’

అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.

అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు.  మామూలు జనం మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.

లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.

“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.

నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.

కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.

“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”

బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన  తర్వాత  ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో  స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపోయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము. పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.          

“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.

“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.

 

నిజంగా నూటికి నూరుపాళ్ళు ఆయన జనం మనిషి. 

అనడానికి దత్తాత్రేయ గారి గురించి మరో జ్ఞాపకం

 

కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ అక్కరలేదు” అన్నారు బండారు దత్తాత్రేయ గారుమీకింకా ఏమి కావాలి’ అని అడిగిన ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణా రావు గారితో.

ఇది 1977 నాటి మాట. ఆ ఏడాది నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి విరుచుకు పడిన ఉప్పెన ధాటికి దివి సీమలో ఊళ్లకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయి. కాళరాత్రిగా మారిన ఆనాటి రాత్రి అకస్మాత్తుగా ముంచెత్తిన సముద్రపు అలల తాకిడికి దివి సీమ శవాల దిబ్బగా మారింది. రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాలతో పాటే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని దారులు మూసుకు పోయాయి. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు అతి కష్టం మీద కొన్ని రోజుల తర్వాత కానీ అక్కడికి చేరలేకపోయారు. వరద తీసిన తర్వాత పేరుకుపోయిన మట్టి మేటల్లో వందలాది మనుషుల శవాలు, పశువుల కళేబరాలు కూరుకు పోయాయి. నష్టం జరిగింది కానీ ఏమేరకు అని అంచనా వేయడానికి అడుగడుగునా అన్నీ ప్రతిబంధకాలే. ఇప్పటి మాదిరిగా కమ్యూనికేషన్ సదుపాయాలు ఆనాడు లేవు.

ఈ నేపధ్యంలో దత్తాత్రేయ గారు అన్నమాట అది, ‘మాకేమీ అక్కరలేదు, గ్యాసు నూనె చాలు’ అని.

బండారు దత్తాత్రేయ ఏమిటి గ్యాసు నూనె కావాలని అడగడం ఏమిటి?  ఈ రెంటికి అసలు ఎక్కడ సంబంధం అనుకోవచ్చు. ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా అనేకమంది తోటి సహచరులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దత్తాత్రేయ గారు దివి సీమకు వెళ్ళారు. వరద నీటిలో తేలుతూ ఉబ్బిపోయిన మనుషుల శవాలను ఒక్క చోటకు చేర్చి వాటికి అనాథ శవ సంస్కారం చేసే ఉత్కృష్టమైన బాధ్యతను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారు. ఈ పని చేయడానికి వారికి కిరోసిన్ అవసరం. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నది స్వయానా నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు. ఆయన కూడా రాత్రి పగలు, దారి డొంకా అని లేకుండా కాలి నడకన కలయ తిరుగుతూ ప్రాణాలతో బయట పడిన దివి సీమ వాసులకు ప్రభుత్వ పక్షాన ధైర్యం చెబుతూ, అధికారులతో మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ వుండడం చూసి హైదరాబాదు నుంచి వెళ్ళిన కొందరు వ్లిలేకరులకు ఆశ్చర్యం వేసింది. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో హైదరాబాదులో చూసిన మనిషి, మట్టి కొట్టుకుపోయిన దుస్తుల్లో ఊరూ వాడా అనకుండా తిరుగుతూ వుండడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది.

స్థానికంగా అన్నీ తానే అయి చూస్తున్న మండలి కృష్ణారావు గారిని దత్తాత్రేయ బృందం కలిసింది. ముందు దత్తాత్రేయ వేష భాషలు చూసి నాగపూర్ నుంచి వచ్చి ఉంటారని మంత్రి అనుకున్నారు.  హైదరాబాదు నుంచి ఆంధ్రజ్యోతి తరపున పరాంకుశం దామోదర స్వామి, ఈనాడు తరపున పాశం యాదగిరి ప్రభ్రుతులకు కూడా దత్తాత్రేయ గారిని ఆనాడు చప్పున గుర్తు పట్టలేని పరిస్థితి.

గ్యాసు నూనె అంటున్నారు ఈయన గారిది హైదరాబాదు అయి వుంటుంది అనే అనుమానం కలిగింది.

పాశం యాదగిరిని చిన్నప్పటి నుంచి పండిత్ పొట్టా (బాల మేధావి) అనే వారు. చాలా విషయాలు గుర్తుంచుకునే ధారణ శక్తి పుష్కలం.

బండారు దత్తాత్రేయ ఎవరన్నది యాదగిరికి చప్పున జ్ఞాపకం వచ్చింది.

ఖాఖీ నిక్కరు వేసుకుని, లాఠీ చేత పట్టుకుని, క్యా ఆలీఘడ్ క్యా గౌహ్వాటీ, అప్ నా దేశ్, అప్నా మాటీ” అంటూ గౌలీగూడాలో తమ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్.ఎస్.ఎస్.  ప్రభాత్ భేరీ బృందం యాదగిరి స్మృతిపధంలో లీలగా మెదిలింది. అందుకే అతడు యాదగిరి కాదు, యాద్ గిరి అని పిలుస్తాను నేను.

ఇక ఇద్దరికీ తాము ఎవరన్నది తెలిసిపోయింది.

నువ్వు పాశం గోపయ్య బిడ్డవు కదా!” అన్నారు దత్తాత్రేయ.

యాదగిరి, దామోదరస్వామి దత్తాత్రేయ బృందంతో కలిసి దివిసీమపై పగబట్టిన ప్రకృతి ఆగ్రహంతో చేసిన విలయ తాండవం తాలూకు ఘోర దృశ్యాలను కళ్ళారా చూసారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కొన్ని కొబ్బరి చెట్ల మట్టలలో చిక్కుకుని వున్న మానవ కళేబరాలను చూసినప్పుడు, నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి సంభవించిన ఉప్పెనతో దివి సీమకు వాటిల్లిన ముప్పు తీవ్రత ఎంతటిదో వారికి అర్ధం అయింది. అంటే ఆ ఎత్తులో సముద్రపు కెరటాలు విరుచుకు పడ్డాయి అన్నమాట.

ఇంకేమీ అక్కరలేదు గ్యాసు నూనె చాలు’ అని నలభయ్ అయిదేళ్ళ నాడే అనాథ శవాల అంత్యక్రియలు చిత్తశుద్ధితో చేసిన బండారు దత్తాత్రేయ గారు  కొన్నేళ్ళకి గవర్నర్ కాగలిగారు.

పదవులు ఊరికే రావు

కింది ఫోటోలు:

ఉప రాష్ట్రపతిగా వున్నప్పుడు శ్రీ వెంకయ్య నాయుడుతో, హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ బండారు దత్తాత్రేయతో  



(ఇంకా వుంది)





 

(ఇంకా వుంది)

సామాన్య పౌరులు ఆశించేది కూడా ఇదే! – భండారు శ్రీనివాసరావు

 నా రెండో కోడలు ఉద్యోగ బాధ్యతల మీద వచ్చే జూన్ లో ఓ వారం రోజులు అమెరికా వెళ్లి రావాలి. ఇది ఆమెకు అలవాటే. ఇదివరకే, చైనాతో సహా  ఇరవై దేశాలు తిరిగి వచ్చింది. వేలిడ్  పాస్ పోర్ట్ వుంది, వేలిడ్ వీసా వుంది. కాకపోతే, పాస్ పోర్ట్ వాలిడిటీ,  ప్రయాణం నాటికి కనీసం ఆరు నెలలు వుండాలి.  అంచేత కొత్త పాస్ పోర్ట్ కు అప్లయ్ చేయాలి. ప్రయత్నిస్తే, మే రెండో తేదీ, నిన్న  మధ్యాన్నం మూడు గంటలకు స్లాట్ దొరికింది. అమీర్ పేట లోని పాస్ పోర్ట్ సేవాకేంద్రానికి వెళ్ళింది. ఈ కేంద్రం TCS వాళ్ళ నిర్వహణలో వుంది. చాలా చక్కగా పనులు జరుగుతున్నాయి. మా కోడలి  మొదటి పాస్ పోర్ట్ ఒడిస్సా రాష్ట్రం, కటక్ లో జారీ చేశారు కాబట్టి పోలీసు వెరిఫికేషన్ అవసరం అయినట్టుంది.  సేవాకేంద్రం  నుంచి ఇంటికి రాకమునుపే మొబైల్ కు మెసేజ్ వచ్చింది.

TGPVC: Dear Sir/Madam, Your passport application is allotted to CILVER SAI KUMAR , Enquiry Officer (PS S R NAGAR). Please keep the documents ready. In case the Enquiry Officer does not contact you within a week, please contact Passport Verification Cell on Ph.No. 8712667600.Hyderabad City Police

మామూలుగా మామూలు మనుషులకు వచ్చే అనుమానమే వచ్చింది. ఇదంతా ఎప్పటికి తెమిలేను?

అయితే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే, ఈ రోజు, మూడో తేదీ  ఉదయం పది గంటలకల్లా, నరసింహ అనే ఉద్యోగి మా ఇంటికి వచ్చి  పాస్ పోర్ట్ ఎంక్వైరీకి వచ్చానని చెప్పాడు. కావాల్సిన డాక్యుమెంట్లు చూసాడు. ఇరుగుపొరుగుతో మాట్లాడాడు. పదే పది నిమిషాల్లో పని పూర్తి చేసుకుని కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయాడు.

వారం రోజుల దాకా వేచి వుండే అవసరం లేకుండా పోయింది.

ప్రతి పనికీ అధికారుల మీదా, సిఫారసుల మీదా ఆధారపడే అవసరం లేని పరిపాలననే సామాన్యుడు కోరుకుంటాడు. సుపరిపాలన అంటే నాకు తెలిసిన అర్ధం ఇదే!  

2, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో ( 155 ) – భండారు శ్రీనివాసరావు

నా మీద నాకే అసూయ

"ఏమిటి మీ ఆరోగ్య రహస్యం?" అడిగాడు ఓ మిత్రుడు.
"ఏమీ లేదు, జ్ఞాపకాలను నమిలి తింటుంటాను"
2019 లో కంటికి రెప్పలా చూసుకున్న మా ఆవిడ నిర్మల హఠాత్తుగా కన్నుమూసింది.
అయిదేళ్లు గడవకముందే 2024 ఫిబ్రవరి నాలుగున, నాకు కుడి భుజంగా వున్న నా రెండో కుమారుడు సంతోష్, తల్లి మీద ప్రేమతో ఆమె దగ్గరికే వెళ్ళిపోయాడు. వాడికి తల్లి అమ్మ ప్రాణం. ఆమె చనిపోయినప్పుడు, ఎవరో పెద్దగా బాడీని తీసుకు రండి అంటుంటే వాడు కోపం ఆపుకోలేక పోయాడు. ' బాడీ ఏమిటి బాడీ. బుద్ది వుందా! ఆమె మా అమ్మ. అమ్మ.' అంటూ విరుచుకుపడ్డాడు. అంత ప్రేమ తల్లి అంటే.
అయిదేళ్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నాకు కాకుండా పోయారు. అయినా దుక్కలా వున్నానంటే జ్ఞాపకాలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ వుంటే చెప్పరాని ఆనందం, చెప్పుకోలేని బాధ రెండూ పడుగుపేకలుగా మనసును ముప్పిరిగొంటాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని స్థితి.
కొన్ని జ్ఞాపకాలు అంతే. తలచుకున్నప్పుడల్లా వయసును మురిపిస్తాయి. మనసుని వేధిస్తాయి.
దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి, కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే నేను పుట్టిన ఆగస్టులోనే, నా పుట్టినరోజున ప్రేమతో కేకు తినిపించిన పదో రోజునే 2019లో కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు.
సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు, నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు భావన అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది. వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువుల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టంలేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే, ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఇచ్చారు.
నా రెండో కోడలు నిషా. ఆమెకు ఏదో పెద్ద కార్పొరేట్ సంస్థలో, దేశ దేశాల్లోని సిబ్బంది మీద అజమాయిషీ చేసే బాధ్యత కలిగిన పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంటుంది.
ఇప్పుడు ఇంట్లో నాకు ఏకైక కాలక్షేపం నా మనుమరాలు జీవిక. సమ్మర్ స్కూలు, సమ్మర్ క్యాంపులు అంటూ దాదాపు పగలల్లా బయటే. మూడేళ్ల ఆ చిన్నదాన్ని కనిపెట్టి చూడడానికి మరో చిన్న కేర్ టేకర్ అంకిత. కోడలు పనిచేసుకునేటప్పుడు (వర్క్ ఫ్రం హోం), నేను రాసుకొనేటప్పుడు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటుంది. వలలి వనిత సరే. దాదాపు పన్నెండేళ్ళుగా మా ఇంట్లో వంటపని చూస్తోంది. చిన్నపని, పెద్దపని, బజారు పని చేయడానికి మా వాచ్ మన్ సమ్మయ్య ఎలాగు వున్నాడు.
మా ఆవిడ వుండివుంటే, ఈ వైభోగాలు చూస్తూ వుంటే, నా కొడుకు బతికి వుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కానీ ఏదీ మన చేతిలో పెట్టలేదు.
దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో, ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, 'చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిట'ని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత?
భయంకరమైన కరోనా రోజుల్లో కూడా బంధు మిత్రుల కుటుంబ సభ్యుల ఆత్మీయతానురాగాలే నాకు బాసటగా నిలిచాయి. ఒంటరితనాన్ని దూరం చేశాయి.
‘మాతరం అన్ని విషయాలను పట్టించుకుంటుంది’
ఒక రాత్రి బీబీసీ తెలుగు న్యూస్ లో ఓ ఆఫ్రో అమెరికన్ అమ్మాయి కాబోలు చెబుతోంది. ఆ చిన్నారి కళ్ళల్లో ఎనలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
ఏపని చేయాలన్నా కాస్త ముందు వెనుకలు చూసుకోవాలి అనే తరం పెంపకంలో పెరిగిన తరం మాది. ఈ ముందు వెనుకల శషభిషలు ఏమాత్రం పట్టించుకోని నేటి తరాన్ని చూస్తూ ఒకింత భయపడే తత్వం కలిగిన నా వంటి వారికి ఆ అమ్మాయి ఓ స్పూర్తి. దీనికి ఓ సొంత నేపధ్యం వుంది.
కరోనా గురించి తెలిసిన తొలి రోజుల్లో ముఖ్యంగా ఇళ్ళల్లో, ఆసుపత్రుల్లో ఐసొలేషన్ గురించీ, మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది అనే ఉద్దేశ్యంతో కరోనా కేసులు వచ్చిన వాడల్లో కంటైన్ మెంటు ఆంక్షలు గురించీ మొదటిసారి విన్నప్పుడు ఒకింత భయంతో కూడిన సందేహాలు మొలకెత్తిన మాట వాస్తవం.
‘భయపడే పనే లేదు’ అనేవారు మా అబ్బాయి సంతోష్, కోడలు నిష.
అనడమే కాదు అన్ని రకాల ఏర్పాట్లు మొదట్లోనే చేశారు. ఆక్సిజన్ సిలిండర్, ఆక్సీమీటర్, లంగ్ ఎక్సర్ సైజ్ చేసే పరికరాలు, అవసరం పడతాయి అనుకున్న మందులు, శానిటైజర్లు అన్నీ తెచ్చి పెట్టారు. లిఫ్టులో ఆక్సిజన్ సిలిండర్ తెస్తున్నప్పుడు మా ఇంట్లో ఎవరికో ఈ కరోనా వచ్చిందని మా ఫ్లాట్లో కొందరు అనుమాన పడ్డారు కూడా. వంటమనిషి, పనిమనిషి రాకపోతే ఏమి చేయాలి అనే విషయాలు కూడా ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారు. అప్పటికి వాక్సినేషన్ ఊసే లేదు.
‘మీరు అధైర్య పడకండి. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోను ఆసుపత్రిలో చేర్చము. కరోనా రాకుండా చేయాల్సింది చేద్దాము. కర్మ కాలి వచ్చినా దాన్ని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేద్దాము. ఈ వ్యాధి గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలియక, టీవీలు చూసి జనం అనవసరంగా కంగారు పడుతున్నారు’
ఇదీ వాళ్ళ వాదన.
నాకప్పుడు అనిపించేది వాళ్ళు ముందు చూపుతో ఆలోచించడం లేదని.
అదే ఇప్పుడు అనిపిస్తోంది, నేనే అప్పుడు ముందు చూపు లేకుండా ఆలోచించానని.
మా చుట్టాల ఇంట్లో పెద్దవాళ్లు ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. పిల్లలు వెంటనే వారికి ఇంట్లోనే ఐ సొలేషన్ ఏర్పాటు చేశారు. మొదటి అయిదు రోజులు ఇవ్వాల్సిన మందులు, ఆహరం ఇచ్చారు. మరో పది రోజులు అలాగే ఉంచారు. ఏ మందుల అవసరం పడలేదు. కొన్ని రోజుల తర్వాత వారికి కరోనా లక్షణాలు తగ్గాయి. వారిలో పెరిగిన అనవసర భయం కూడా తగ్గింది.
భయానికి ఓ స్వభావం వుంది. దాన్ని చూసి బెదిరితే మరింత బెదరగొడుతుంది. మనం అదరగొడితే అది తోక ముడుస్తుంది.

తోకటపా:
కరోనాకు టీకా అందుబాటులోకి రాగానే హైదరాబాదులో కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మొదటి వరుస వారిలో నేనున్నాను. అలాగే రెండో డోసు కూడా సకాలంలోనే తీసుకున్నాను.
ఈ నేపధ్యంలో ఒకరోజు అంటే 2021 సెప్టెంబరులో ఎనిమిదో తేదీన నాకు రాపిడ్ కోవిడ్ టెస్ట్ చేశారు. అదీ రాజ్ భవన్ లో.
రాజ్ భవన్ నాకు కొత్త కాదు. జ్వాలా నరసింహా రావు రాజ్ భవన్ లో పనిచేసున్న రోజుల్లో అనేక సాయంత్రాలు నాకు అక్కడే గడిచేవి. రేడియో విలేకరిగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలకు పలుమార్లు వెళ్ళిన అనుభవం వుంది. ఇది కారణం కావచ్చు, అక్కడ పనిచేస్తున్న పాత సిబ్బందిలో అనేకమంది నన్ను గుర్తు పట్టి పలకరిస్తూ వుంటారు. అలాంటిది ఆ రోజు రాజ్ భవన్ ఆహ్వానం మేరకు నేను పదకొండు గంటల ప్రాంతంలో మెయిన్ గేటు దాటి లోపలకు వెళ్ళగానే అక్కడ వున్న సిబ్బందిలో ఒకరు, కొంచెం ముందుకు వెళ్ళమని చేత్తో సైగ చేశారు. అలానే వెడితే, అక్కడ రెండు తాత్కాలిక గుడారాలు వున్నాయి. నాకంటే ముందు చేరుకున్న కొందరు సీనియర్ జర్నలిష్టులు, శ్రీయుతులు దాసు కేశవరావు, గోవిందరాజు చక్రధర్, నందిరాజు రాధాకృష్ణ, ఉడయవర్లు మొదలైన వాళ్ళు అక్కడ క్యూలో నిలబడి వున్నారు. మా మొబైల్ నెంబర్లు తీసుకున్నారు. కోవిడ్ టీకా ఎన్ని డోసులు తీసుకున్నారు అనే విషయం ఆరా తీశారు. అక్కడ కుర్చీల్లో కూర్చోబెట్టి, ముక్కుల్లోకి ఏదో గొట్టం లాంటిది పెట్టి చూసారు. కాసేపటి తరువాత ఏమీ లేదు, ఇప్పుడు వెళ్ళండి అని మర్యాదగానే చెబుతూ రాజ్ భవన్ లోపలకి అనుమతించారు.
కోవిడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న పద్దతి కొంచెం వింతగా అనిపించింది.
కింది ఫోటో:
రాపిడ్ కోవిడ్ టెస్ట్ కాపీ
(ఇంకా వుంది)
May be an image of text that says "RAJ BHAVAN HYDERABAD COVID TEST Name B.Sriniv B.SrinivasRao rnivarrao Reg RegNo:96 RegNo: No: 96 Result: Nugatine we"
All reactions:
1
Like
Comment
Share
Facebook