దేశాన్ని కరోనా పట్టి పీడిస్తున్న రోజులు. జనమంతా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో
తెలియక తమని గురించే తామే మధన పడుతున్న రోజులు. రోజు ఎలా గడుస్తుందో అని రోజులు లెక్క పెట్టుకుంటున్న రోజులు.
2020 మే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.
“భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు
మాట్లాడుతారు”
వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి
ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక
పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.
“శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”
“నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”
“నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి
మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”
“..........”
“హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”
“అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను.
మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా
దొరికింది”
“ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”
“....................”
“ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన
తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”
“చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”
“నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త!
వుంటాను శ్రీనివాసరావు గారు”
తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా
సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను?
2020 సంవత్సరం మే నెల 12 వ తేదీ.
“నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను.
గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి స్వచ్చమైన హిందూస్థానీలో.
కాసేపటి
తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.
“ఏం
శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.
“మీ ఆరోగ్యం
ఎలా వుంది” నా పరామర్శ.
“బాగానే
వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’
అప్పుడు ఆర్ధం
అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.
అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ
సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు. మామూలు జనం మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్.
వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.
లాక్ డౌన్
పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.
“నన్ను
చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా
చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ
సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు.
అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్
చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.
నిజమే. ఆయన
రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు.
నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్
కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ
గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి
సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా
ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.
కాసేపు
మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో
మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు
ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.
“మన
కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా
రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం.
ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”
బండారు
దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు.
ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా
రాత్రి పదకొండు దాటిన తర్వాత ఆయన్ని
వెంటబెట్టుకుని రేడియో స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు
నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ
వెంటనే అయిపోయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము.
పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా
పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.
“ఇదిగో ఈ లాక్
డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు
కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.
“లేదా మీరే
సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.
నిజంగా నూటికి
నూరుపాళ్ళు ఆయన జనం మనిషి.
అనడానికి దత్తాత్రేయ గారి గురించి మరో
జ్ఞాపకం
“కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ అక్కరలేదు” అన్నారు బండారు దత్తాత్రేయ గారు ‘మీకింకా ఏమి కావాలి’ అని అడిగిన ఆనాటి
మంత్రి మండలి వెంకటకృష్ణా రావు గారితో.
ఇది 1977 నాటి మాట. ఆ ఏడాది నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి విరుచుకు
పడిన ఉప్పెన ధాటికి దివి సీమలో ఊళ్లకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయి. కాళరాత్రిగా
మారిన ఆనాటి రాత్రి
అకస్మాత్తుగా ముంచెత్తిన సముద్రపు అలల తాకిడికి
దివి సీమ శవాల దిబ్బగా మారింది. రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది.
గ్రామాలతో పాటే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు
వెళ్ళడానికి అన్ని దారులు మూసుకు పోయాయి. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు అతి కష్టం మీద కొన్ని రోజుల
తర్వాత కానీ అక్కడికి చేరలేకపోయారు. వరద తీసిన తర్వాత పేరుకుపోయిన మట్టి మేటల్లో
వందలాది మనుషుల శవాలు, పశువుల కళేబరాలు కూరుకు పోయాయి. నష్టం జరిగింది కానీ ఏమేరకు అని
అంచనా వేయడానికి అడుగడుగునా అన్నీ ప్రతిబంధకాలే. ఇప్పటి మాదిరిగా
కమ్యూనికేషన్ సదుపాయాలు ఆనాడు లేవు.
ఈ నేపధ్యంలో దత్తాత్రేయ గారు అన్నమాట
అది, ‘మాకేమీ అక్కరలేదు, గ్యాసు నూనె చాలు’ అని.
బండారు దత్తాత్రేయ ఏమిటి గ్యాసు నూనె
కావాలని అడగడం ఏమిటి? ఈ రెంటికి అసలు ఎక్కడ సంబంధం అనుకోవచ్చు. ఒక
ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా అనేకమంది తోటి సహచరులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో
పాల్గొనేందుకు దత్తాత్రేయ గారు దివి సీమకు వెళ్ళారు. వరద నీటిలో తేలుతూ ఉబ్బిపోయిన
మనుషుల శవాలను ఒక్క చోటకు చేర్చి వాటికి అనాథ శవ సంస్కారం చేసే ఉత్కృష్టమైన
బాధ్యతను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారు. ఈ పని
చేయడానికి వారికి కిరోసిన్ అవసరం. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నది స్వయానా
నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు. ఆయన కూడా రాత్రి పగలు, దారి డొంకా అని లేకుండా కాలి నడకన కలయ తిరుగుతూ ప్రాణాలతో బయట పడిన దివి సీమ వాసులకు ప్రభుత్వ పక్షాన ధైర్యం చెబుతూ, అధికారులతో మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ వుండడం చూసి హైదరాబాదు నుంచి
వెళ్ళిన కొందరు వ్లిలేకరులకు ఆశ్చర్యం వేసింది. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో
హైదరాబాదులో చూసిన మనిషి,
మట్టి కొట్టుకుపోయిన దుస్తుల్లో ఊరూ వాడా
అనకుండా తిరుగుతూ వుండడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది.
స్థానికంగా అన్నీ తానే అయి చూస్తున్న మండలి కృష్ణారావు గారిని దత్తాత్రేయ బృందం కలిసింది.
ముందు దత్తాత్రేయ వేష భాషలు చూసి నాగపూర్ నుంచి వచ్చి ఉంటారని మంత్రి
అనుకున్నారు. హైదరాబాదు నుంచి ఆంధ్రజ్యోతి
తరపున పరాంకుశం దామోదర స్వామి, ఈనాడు తరపున పాశం యాదగిరి ప్రభ్రుతులకు
కూడా దత్తాత్రేయ గారిని ఆనాడు చప్పున గుర్తు పట్టలేని పరిస్థితి.
గ్యాసు నూనె అంటున్నారు ఈయన గారిది
హైదరాబాదు అయి వుంటుంది అనే అనుమానం కలిగింది.
పాశం యాదగిరిని చిన్నప్పటి నుంచి
పండిత్ పొట్టా (బాల మేధావి) అనే వారు. చాలా విషయాలు గుర్తుంచుకునే ధారణ శక్తి
పుష్కలం.
బండారు దత్తాత్రేయ ఎవరన్నది యాదగిరికి
చప్పున జ్ఞాపకం వచ్చింది.
“ఖాఖీ నిక్కరు వేసుకుని, లాఠీ చేత పట్టుకుని, క్యా ఆలీఘడ్ క్యా గౌహ్వాటీ, అప్ నా దేశ్, అప్నా మాటీ” అంటూ గౌలీగూడాలో తమ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్.ఎస్.ఎస్. ప్రభాత్ భేరీ బృందం యాదగిరి స్మృతిపధంలో లీలగా మెదిలింది. అందుకే అతడు యాదగిరి కాదు, యాద్ గిరి అని పిలుస్తాను నేను.
ఇక ఇద్దరికీ తాము ఎవరన్నది
తెలిసిపోయింది.
“నువ్వు పాశం గోపయ్య బిడ్డవు కదా!” అన్నారు దత్తాత్రేయ.
యాదగిరి, దామోదరస్వామి దత్తాత్రేయ బృందంతో కలిసి దివిసీమపై
పగబట్టిన ప్రకృతి ఆగ్రహంతో చేసిన విలయ తాండవం తాలూకు ఘోర దృశ్యాలను కళ్ళారా చూసారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కొన్ని కొబ్బరి చెట్ల
మట్టలలో చిక్కుకుని వున్న మానవ కళేబరాలను చూసినప్పుడు, నవంబరు పందొమ్మిది
అర్ధరాత్రి సంభవించిన ఉప్పెనతో దివి సీమకు వాటిల్లిన ముప్పు
తీవ్రత ఎంతటిదో
వారికి అర్ధం అయింది. అంటే ఆ ఎత్తులో సముద్రపు
కెరటాలు విరుచుకు పడ్డాయి అన్నమాట.
‘ఇంకేమీ అక్కరలేదు గ్యాసు నూనె చాలు’ అని నలభయ్ అయిదేళ్ళ నాడే అనాథ
శవాల అంత్యక్రియలు చిత్తశుద్ధితో చేసిన బండారు దత్తాత్రేయ గారు కొన్నేళ్ళకి గవర్నర్ కాగలిగారు.
పదవులు ఊరికే రావు
కింది ఫోటోలు:
ఉప రాష్ట్రపతిగా వున్నప్పుడు శ్రీ
వెంకయ్య నాయుడుతో, హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ బండారు
దత్తాత్రేయతో
(ఇంకా వుంది)